ఎన్నికలలో వైసీపి ఓడిపోయి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఇక వారి పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. శాసనసభలో ప్రమాణస్వీకారం చేసి వెంటనే బయటకు పారిపోయినప్పుడు, నెలరోజులుగా జగన్ బయటకు రాకుండా ప్యాలస్లోనే కాలక్షేపం చేస్తుంటే జగన్ జనం మద్యకు రావడానికి భయపడుతున్నారని అనుకున్నారు.
జగన్ని గద్దె దించేశామని, ఆయన చల్లబడిపోయారని ఈ నెల రోజులు టిడిపి శ్రేణులు సంబరాలలో మునిగిపోయారు. కానీ ఈ నెలరోజులు జగన్ ప్యాలస్లో కూర్చొని భవిష్య కార్యాచరణకు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారని ఎవరూ అనుకోలేదు.
కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపి నేతలు, వారి సొంత మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్కువ అంచనా వేయడం పెద్ద పొరపాటని వినుకొండ పర్యటనలో జగన్ చేసిన డ్రామా చూశాక స్పష్టం అయ్యింది. అలాగే తనను తక్కువ అంచనా వేస్తే టిడిపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవని కూడా జగన్ అప్పుడే నిరూపిస్తున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ మీడియాకు ట్వీట్ చేయడం గమనిస్తే ఇదంతా జగన్ వ్యూహంలో భాగమే అని అర్దమవుతోంది.
ఈ నెల 22నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో శాతియుతంగా ధర్నా చేస్తానని, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి వివరిస్తానని ప్రకటించారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేస్తే అందరి దృష్టిని ఆకర్షించగలరు. ముఖ్యంగా జాతీయ మీడియాని ఆకర్షించగలరు. అంటే జగన్ పక్కా ప్లాన్తో తన వ్యూహం అమలుచేస్తున్నారని స్పష్టం అవుతోంది.
సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను, ఐటి కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జాతీయ, అంతర్జాతీయ మీడియాకు చెపుతుంటే ఎటువంటి దుష్ప్రభావం ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని ఐటి కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడుదారులు ఆంధ్రాకు రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో కూడా రాష్ట్రంలో అటువంటి పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెపుతుంటే ఎవరైనా రాష్ట్రానికి వస్తారా?
కనుక కాస్త ఆలస్యమైనా జగన్ చాలా పెద్ద వ్యూహంతోనే దూసుకువచ్చారు. తన వ్యూహం, పర్యవసనాల పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నారు. మరి టిడిపి ఉందా?






