ఈ మాటలన్నది మరెవరో కాదు… తెలంగాణ ఐటి పరిశ్రమల మంత్రి కేటీఆర్! తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆంధ్రా ఓటర్లు చాలా కీలకం. కనుక వారిని ప్రసన్నం చేసుకొనేందుకు కేటీఆర్, తాము ఎంతగానో ద్వేషిస్తున్న చంద్రబాబు నాయుడుని పొగడక తప్పడం లేదు. తెలంగాణను ఆంధ్రాకు దోచిపెట్టారని విమర్శిస్తున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, తాము అవహేళన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని పొగడక తప్పడం లేదు.
కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వూలో “అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులు తప్పక గుర్తుకువస్తారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. ముగ్గురూ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు,” అని కేటీఆర్ అన్నారు.
అదే ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు నిరసనలు తెలపడంపై తాను కాస్త కటువుగా మాట్లాడానని కూడా కేటీఆర్ ఒప్పుకొన్నారు.
తాజాగా ఓ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి నాకు పెద్దన్న వంటి వారు. ఆయనతో నాకు మంచి బలమైన అనుబందం ఉంది. దావోస్ పర్యటనలో ఇద్దరం కలిసి భోజనం చేస్తూ సుమారు రెండు గంటలు మాట్లాడుకొన్నాము,” అని చెప్పారు.
కానీ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్తో సహా బిఆర్ఎస్ నేతలందరూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో ఆంధ్రా నాయకులు వస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్కు మద్దతుగా టిడిపి, వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నారని, బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పోటీ చేయడాన్ని వారు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటున్నారు.
కేసీఆర్ కూడా తన ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ అభివృద్ధి గురించి వివరించేందుకు ఆంధ్రాలో రోడ్లు, కరెంటు, నీళ్ళ సమస్యల గురించి చెపుతూ, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కూడా ఆంధ్రాలాగ దయనీయంగా మారిపోతుందని హెచ్చరిస్తుంటారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి రెండు నెలలు జైల్లో పెడితే, కేసీఆర్, కేటీఆర్ ఖండించలేదు. నేటికీ కనీసం స్పందించనే లేదు!
ఆంధ్రా పార్టీలు, వాటి నేతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కేసీఆర్, బిఆర్ఎస్ నేతలకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకొనేందుకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?కానీ తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రా ఓటర్లు బిఆర్ఎస్ నేతల ద్వంద వైఖరిని గ్రహించలేరనుకోవడం అవివేకం కాదా?




