ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో ఓడిపోతే ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓటమికి అసలు కారణాలు ఏమిటని తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేయాలి. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో గుర్తించుకుని వాటిని సరిదిద్దుకోవాలి.
మారిన రాజకీయ పరిస్థితులను బట్టి తన ఆలోచనలు, దృక్పధం అన్నీ మార్చుకొని ప్రజల మద్యకు వెళ్ళాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ నిరూపించి చూపారు.
కానీ ప్రభుత్వంలో బ్యూరోక్రసీ, హిపోక్రసీ ఏవిదంగా పేరుకుపోయి ఉంటుందో అదేవిదంగా రాజకీయ పార్టీలలో పేరుకుపోవడంతో, ‘ఆత్మ పరిశీలన’ ప్రక్రియ లాంఛనంగా మారిపోయింది. అందుకే కేసీఆర్ ప్రజలను, జగన్ ఈవీఎంలను నిందిస్తూ ‘మమ’ అనిపించేశారు.
ఈవిదంగా చేయడం పార్టీకి మంచిది కాదని తెలిసి ఉన్నప్పటికీ అధినేతలకు అహం, పార్టీ నేతలకు నిసహాయత అడ్డొస్తుంటుంది. కనుక అందరూ కలిసి ‘మమ’ అనిపించేసి మళ్ళీ ప్రజల మద్యకు వచ్చేస్తుంటారు.
దాని వలన వారికే తప్ప ప్రజలకు నష్టం ఉండదు కనుక ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తాము మారాల్సి ఉండగా ప్రజలు, ముఖ్యమంత్రి, మంత్రుల తీరు మారాలని సుద్దులు చెపుతుండటమే విడ్డూరం.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత జగన్ జైల్లో అడుగుపెట్టారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసమే జైల్లో అడుగుపెట్టినప్పటికీ అది అశుభాన్ని సూచిస్తున్నట్లే ఉందని వైసీపిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ తర్వాత పిన్నెల్లికి జగన్ క్లీన్ సర్టిఫికేట్ జారీ చేసేసి, చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పేశారు. వాటిలో ఒకటి చంద్రబాబు నాయుడు ధోరణి మారాలని!
టిడిపి నేతలు, కార్యకర్తల మనసులో మాటనే జగన్ చెప్పారనిపిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఇదే కోరుకొంటున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్, వైసీపి నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను భరిస్తూనే ధీటుగా ఎదుర్కొనేవారు. ముఖ్యమంత్రి అయ్యాక వారి పట్ల కటినంగా వ్యవహరిస్తారని అందరూ ఎదురుచూస్తుంటే, ఆయన ఏం చేస్తారో అని వైసీపి నేతలు ఆందోళన చెందుతూ ఎదురుచూస్తున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా సంయమనం పాటిస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పక తప్పదు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రావాలన్నా, ప్రముఖ జాతీయ అంతర్జాతీయ సంస్థలు రావాలన్నా, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయని, సరైన విధానాలు కలిగిన ప్రభుత్వం ఉందనే నమ్మకం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
జగన్ ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వలననే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఏవీ రాలేదు. జగన్కు ఈవిషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అందుకే వైసీపి పట్ల చాలా సంయమనం పాటిస్తున్నారని చెప్పవచ్చు.
కానీ 5 ఏళ్ళపాటు వైసీపి దౌర్జన్యాలను భరించిన టిడిపి నేతలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే చాలా అసహనంగా ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు మారాలని, జగన్తో సహా వైసీపి నేతలందరితో కటినంగా వ్యవహరిచాలని కోరుతున్నారు.
ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు నాయుడు మారాలని కోరుకుంటున్నారు. కనుక మారితే అటు వైసీపీ, ఇటు టిడిపి నేతలకి అందరికీ సంతోషం కలుగుతుంది కదా?






