ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈసారి కేసీఆర్ వేలు పెట్టలేకపోయినా, వైసీపి గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మనసారా కోరుకుంటున్నారు కూడా. కనుక కొడుకు కేటీఆర్ చేత కూడా అలాగే చెప్పించారు. అయితే తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోతారని ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్ మాత్రం ఏపీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని లేకుండా ప్రజలే తన మొహాన్న పేడ నీళ్ళు చల్లుతారని చెప్పారు.
కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరికీ ఎన్నికల పట్ల చాలా లోతైన అవగాహన ఉంది. కానీ ఇద్దరూ భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు?అని ఆలోచిస్తే జగన్ తనతో చేతులు కలిపి, తెలంగాణలో తాను మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడతారనే ఆశతోనే కేసీఆర్ జగన్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పవచ్చు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలను రప్పించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.
అయినా తెలంగాణ ప్రజలు ఆయనను వద్దనుకున్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దయనీయ పరిస్థితికి జారుకుందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు కొన్ని సందర్భాలలో స్వయంగా అన్నారు కూడా. కానీ సంక్షేమ పధకాలు, ప్రతిపక్షాలను వేధించడం తప్ప ఏపీకి మరేమీ చేయని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రజలు గెలిపిస్తారని కేసీఆర్ చెపుతున్నారు. ఎందుకంటే తమకు రాజకీయంగా ఉపయోగపడతారనే.
అయితే కేసీఆర్కి జగన్ అవసరం ఉంది కనుక, ఆయన కోరుకున్నంత మాత్రన్న ఏపీ ప్రజలు జగన్ గెలిపించేస్తారా? అంటే కాదనే అర్దమవుతుంది.
కానీ ప్రశాంత్ కిషోర్ నాడు బీజేపీ మొదలు గత ఎన్నికలలో వైసీపి వరకు పలు పార్టీల కోసం పనిచేసి ఆయా పార్టీలను ఔపోసన పట్టారు. మోడీ మొదలు జగన్మోహన్ రెడ్డి వరకు అనేక మంది అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు.
అందుకు ఆయన ఎంచుకున్న పద్దతులు సరికానప్పటికీ, ఈ ఎన్నికల జూదంలో ఆయన చాలా ఆరితేరినవారు. కనుక ఏపీలో జగన్ ఓడిపోబోతున్నారని చెప్పడమే కాకుండా ఎందువల్ల ఓడిపోబోతున్నారో కూడా చెపుతున్నారు.
సంక్షేమ పధకాలతోనే ప్రజలను ప్రసన్నం చేసుకుంటే ఓట్లు రాలుతాయని అనుకోవడం అవివేకమేనని, ఒకవేళ అదే సాధ్యమైతే, కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు ఈ ఫార్ములానే అమలుచేస్తూండేవి కదా?అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీర్చడం అంటే వారికి డబ్బులు పంచిపెట్టడమే అని జగన్ అనుకున్నారు తప్ప వాటితో ప్రజల అవసరాలు ఎన్నటికీ తీరవని జగన్ గ్రహించలేకపోయారన్నారు. ఒకవేళ తీరిపోయుంటే, ప్రజలు సంక్షేమ పధకాల కోసం ఎదురుచూసేవారే కాదు. వైసీపి కూడా సంక్షేమ పధకాలు కొనసాగించేదే కాదు కదా?అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నకు బహుశః జగన్ కూడా జవాబు చెప్పలేకపోవచ్చు.
ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలను జగన్ అర్దం చేసుకోకుండా తాను ఎంచుకున్న పద్దతిలో ముందుకు సాగిపోవడం వలననే ఈసారి ఎన్నికలలో ఆయనకు ఘోర పరాజయం తప్పదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
జగన్ గెలుపు గురించి కేసీఆర్ చెప్పిన మాటలు చిలక జోస్యంలా ఉంటే, జగన్ ఓటమి గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు చాలా హేతుబద్దంగా ఉన్నాయని అర్ధమౌతూనే ఉంది…కదా?






