ఓటమిలో కలసి ప్రయాణం చేసిన బంధం విజయంలో కలహాలను తెచ్చి పెట్టింది, కష్టం లో అక్కరకొచ్చిన బంధుత్వం సుఖంలో భారం అయ్యింది అనేలా వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి వైస్ షర్మిల మధ్య అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారిపోయింది.
నాడు వైసీపీ గెలుపు కోసం పాదయాత్ర చేసిన షర్మిల నేడు వైసీపీ ఓటమి కోసం ప్రతీకార ప్రకటనలు చేస్తున్నారు. నాడు అన్న పదవి కోసం ప్రచారం చేసిన చెల్లి నేడు జగన్ మీద పోరాటానికి సై అంటుంది. ఇలా వైసీపీ ఒక్క గెలుపు, జగన్ ముఖ్యమంత్రి పదవి వైఎస్ కుటుంబంలో చిచ్చు రాచేస్తే ఇప్పుడు అదే పరిస్థితులను కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటుంది.
ఒకప్పుడు అన్నాచెల్లెళ్ల బంధానికి నిలువెత్తు రూపం వైస్ జగన్, షర్మిల అన్నట్టుగా ఉన్న సందర్భాలు ఇప్పుడు ఒకరిముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. నాడు చెల్లి మీద ప్రేమతో షర్మిల పై సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని అభ్యంతరకర పోస్టుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జగన్, చివరికి తన సొంత మీడియాలోనే షర్మిల వ్యక్తిగత జీవితం పై విష ప్రచారం చేసే స్థాయికి దిగజారారు.
అయితే ఇదంతా వైస్ జగన్ గతం అనుకుని సర్దిచెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే కేటీఆర్ వర్తమానం గా మారుతుంది. నాడు వైఎస్ కుటుంబంలో మొదలైన కుటుంబ వివాదాలు రాజకీయ రచ్చగా మారితే నేడు కల్వకుంట్ల ఇంట్లో మొదలైన రాజకీయ ఆధిపత్యాలు కుటుంబం విభేదాలను సృష్టించాయి.
రాష్ట్ర పోరాటాలతో దేశ రాజకీయాలను తన వైపు చూసేలా చేసుకోగలిగిన కేసీఆర్ ఇప్పుడు తన ఇంటి పోరును గడప దాటకుండా చేయలేకపోయారు. పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం కోసం మొదలైన కల్వకుంట్ల ఇంటి పోరు ఇప్పుడు సీఎం సీఎం నినాదాలతో వీధికెక్కుతున్నాయి.
నాడు వైఎస్ కుటుంబంలో ఎదురయినా అన్న చెల్లెళ్ళ పోరే ఇప్పుడు కల్వకుంట్ల ను వెంటాడుతుంది. నాడు జగన్ మాదిరి నేడు కేటీఆర్ కూడా కవితకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా కేటీఆర్ ని చుట్టుముడుతున్నాయి.
అలాగే సొంత చెల్లెలి మీద లేని ప్రేమ, ఆప్యాయత జగన్ కు సామాన్య ప్రజల మీద ఉంటుందా అంటూ నాడు జగన్ ఎదుర్కొన్న చెల్లెల పోరు, ఇంటి ఆడపడుచు ఉసురు నేడు కేటీఆర్ వెంట నడుస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే నాటి జగన్ గతమే నేడు కేటీఆర్ వర్తమానంగా మారిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రేపు రాఖి పౌర్ణమి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అందరి చూపు ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అన్నా చెల్లెళ్ళ మీదే. అయితే వైసీపీ రచ్చతో జగన్, షర్మిల మధ్య ఉన్న విభేదాలు తార స్థాయికి చేరుకున్నప్పటికీ, బిఆర్ఎస్ సైలెన్స్ తో కేటీఆర్, కవిత ల మధ్య సాగుతున్న పోరు ఇంకా బట్టబయలు కాలేదు.




