పరామర్శకు వెళ్లి నవ్వులు..నిరసనకు వెళ్లి అరుపులు..!

jagan-laughs-at-condolence-and-shouts-at-protest

గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం నీలి రంగు మాత్రమే కనిపించాలి అని భావించిన జగన్ ప్రభుత్వ భవనాల నుండి ప్రయివేట్ ఆస్తుల వరకు అన్నిటికి వైసీపీ రంగులు వేసి ఆయన బొమ్మలను ముద్రించారు.

ADVERTISEMENT

అయితే అప్పుడు ఏపీ అంతటా నీలి రంగు ఛాయలు అంటించిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఆ నీలి రంగుకు తన చేతులతో తానే మసి పూసుకున్నట్టు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి గల్లీలో జరిగిన గొడవకు ఢిల్లీలో నిరశన తెలపడానికి సిద్ధమయ్యారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జాతీయ మీడియాతో స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా ప్రసంగించి వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

ముఖ్యమంత్రి హోదాలో ఎన్నడూ మీడియా ముందుకు రాని జగన్ ప్రతిపక్షంలోకి రాగానే మీడియా ముందుకొచ్చి రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని నానాయాగీ చేస్తున్నారు. ఇన్నాళ్లుగా రాజా రెడ్డి రాజ్యాంగాన్ని నడిపించిన జగన్ ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని సహించలేకపోతున్నారు అంటూ టీడీపీ నేతలు జగన్ పై ప్రతి విమర్శలు చేసున్నారు.

అయితే ఒక్కో సారి జగన్ వ్యవహార శైలి గమనిస్తే ఆశ్చర్యం, అనుమానం రెండు ఏకకాలంలో వస్తాయి. వినుకొండ దుర్ఘటనలో చనిపోయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ అక్కడ రషీద్ కుటుంబ సభ్యులను చూసి చిక్కటి చిరునవ్వు కురిపించి గత వైసీపీ ప్రభుత్వ పథకాల గురించి వివరించుకుంటూ వచ్చిన పనికి చేసే పనికి సంబంధం లేకుండా చేసుకుని నవ్వుల పాలయ్యారు.

చావుల దగ్గరకెళ్ళి నవ్వుకోవడాలు, శవాలు కనపడితే రాజకీయాలు చేయడాలు, వాటిని అడ్డుపెట్టుకుని ఓదార్పు, పరామర్శలు అంటూ యాత్రలు మొదలుపెట్టడాలు జగన్ రాజకీయ దినచర్యలో భాగమయిపోయాయి. తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని ఓదార్పు యాత్రలు చేసారు, బాబాయ్ హత్యను అడ్డుపెట్టుకుని శవ రాజకీయాలకు తెరలేపారు.

ఇప్పుడు మళ్ళీ అదే ధోరణితో ముందుకెళ్తున్న జగన్ ఒక పక్క హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు అవినాష్ రెడ్డి, అనంత బాబు ను వెంటేసుకుని హత్యా రాజకీయాలు అప్రజాస్వామ్యమంటూ హస్తినలో అరుస్తున్నారు. పరామర్శకు వెళ్లి నవ్వులు..నిరసనకు వెళ్లి అరుపులు ఇవేనా వైసీపీ రాజకీయాలు అంటూ ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories