రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకోవడం అంటే ఇదేగా?

Jagan Mohan Reddy on Andhra drought

పదవి, అధికారం చేతిలో ఉన్నప్పుడు పాలకుల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. కనుక ప్రతిపక్షమనే అంకుశం చాలా అవసరం. ఒకవేళ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలి. అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.

కానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని మంకు పట్టు పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉండగా ఇంట్లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT

ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వం ఎల్‌నినోని ఎదుర్కోవడంలో విఫలమైందని చెపుతున్నారు.

“ఈ ఏడాది ఫిభ్రవరిలోనే సిఎం చంద్రబాబు నాయుడు ఎల్‌నినో ప్రభావం వలన రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత జూలై 11న వర్షాలు పడకపోయినా నీళ్ళిస్తామని చెప్పడంతో పలు జిల్లాలలో రైతులు వ్యవసాయం మొదలుపెట్టారు.

కానీ నీళ్ళు ఇవ్వకపోవడం వలన రాష్ట్రంలో సుమారు 56 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. కనీసం ఖరీఫ్ పంట భీమా సొమ్ము రూ.1,400 కోట్లు కట్టినా రైతులు ఈ నష్టం నుంచి బయటపడేవారు. కానీ అదీ కట్టలేదు,” అని విమర్శించారు.

రాష్ట్రానికి సంబందించిన ఇలాంటి సమస్యపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సి ఉండగా, ప్రభుత్వంపై జిల్లా నేతలకు పిర్యాదు చేయడం ఎలా ఉందంటే… రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్లే ఉంది.

ఇదే.. ఆయన శాసనసభలోనో లేదా పంట నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించి రైతుల సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండి ఉంటే.. దాని ప్రభావం వేరేగా ఉండేది కదా?

ప్రతిపక్షనేతగా శాసనసభలో నిలదీస్తే ప్రభుత్వం తప్పనిసరిగా జవాబు చెప్పాలి. ఒకవేళ ఈ సమస్యపై ప్రభుత్వం అశ్రద్ధ వహించి ఉండి ఉంటే తక్షణం మేల్కొని సమస్య పరిష్కరించి ఉండేది.

ఒకవేళ జగన్‌ పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తే, ఈ సమస్య యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులందరి దృష్టికి కూడా వెళుతుంది. ఆ భయంతోనైనా ప్రభుత్వం ఈ సమస్యని తక్షణం పరిష్కరించేది.

కానీ జగన్మోహన్ రెడ్డి ప్యాలస్‌లో కూర్చొని, పార్టీ నేతలకు పిర్యాదు చేస్తున్నారు. తాను ఏసీ ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తూ పార్టీ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వంతో పోరాడమని చెపుతున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories