రాజకీయాలలో ఉన్నవారు, ముఖ్యంగా అధినేతలు, ముఖ్య నాయకులు ఏ మతానికి చెందినవారైనప్పటికీ, ఇతర మతాల పట్ల గౌరవం ప్రదర్శిస్తుంటారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవారు. అప్పుడప్పుడు విశాఖలో శారదా పీఠాధిపతితో భేటీ అవుతుండేవారు. అది హిందూ మతానికి సంబందించి సలహాల కోసం కావని అందరికీ తెలుసు.
జగన్ అప్పుడప్పుడు తిరుమలకి కూడా వెళ్ళి వస్తుండేవారు. అది శ్రీవారిపై భక్తితో కాదని అందరికే తెలుసు. టీటీడీ బోర్డులో నింపేసిన వైసీపీ నేతలకు ‘మార్గ దర్శకాలు’ జారీ చేసేందుకు కావచ్చు లేదా రాష్ట్రంలో హిందువుల ఓట్ల కోసం కావచ్చు లేదా మరొకటి కావచ్చు.
కానీ హిందూమతం పట్ల జగన్కి ఎంత చులకన భావం ఉందో రాష్ట్రంలో ఆలయాలలో జరిగిన అపచారాలతో, విగ్రహాల విధ్వంసాలతో బయటపడింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో బయటపడింది . ఈ వ్యవహారం బయటపడిన తర్వాత జగన్ తిరుమలకు బయలుదేరబోయారు. కానీ ‘డిక్లరేషన్ ఫారం’ సంతకం పెట్టాలనేసరికి పర్యటన రద్దు చేసుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ పదవీ అధికారం కోల్పోయిన తర్వాత ‘ఏం చేస్తే చెల్లుతుంది?’ అని జగన్ ఆలోచన చేస్తున్నట్లున్నారు.
నిన్న తాడేపల్లి ప్యాలస్లో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో జగన్ నుదుట బొట్టుతో ప్రత్యక్షమయ్యే సరికి వైసీపీ నేతలు కూడా బహుశః కంగు తినే ఉంటారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్లో రహస్యంగా ఏవైనా పూజలు, యాగాలు చేయిస్తున్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ బొట్టు కాకతాళీయం మాత్రం కానే కాదని అందరూ అంగీకరిస్తారు. కానీ ఆ బొట్టు దేనికో.. దాని వెనుక ఏం ప్లాన్ దాగి ఉందో?తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!




