ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఎన్నికల ప్రచారమలో అమరావతి, విశాఖ రాజధాని, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, రాష్ట్రాభివృద్ధి గురించి ప్రస్తావించి ఇబ్బంది పెట్టకుండా వైసీపి ఎప్పటికప్పుడు వారికి ఏదో మసాలా ఐటెమ్స్ అందిస్తూ జాగ్రత పడుతూనే ఉంది.
ప్రతిపక్షాలను కీలకమైన ఈ అంశాల నుంచి తెలివిగా డైవర్ట్ చేయడమే కాకుండా వైసీపి ఎవరూ కూడా వాటి గురించి మాట్లాడకుండా జగన్ బాగానే కట్టడి చేశారు. ఐదేళ్ళుగా సంక్షేమ పధకాల డప్పు కొట్టుకోవడం అందరికీ బాగానే అలవాటు చేశారు కనుక వైసీపి అభ్యర్ధులు అందరూ వాటితోనే ఎన్నికల ప్రచారం కానిచ్చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు, మూడు పెళ్ళిళ్ళ కధతోనే ప్రజలను అలరించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
భీమవరం సభలో మళ్ళీ అదే పాట పాడి పవన్ కళ్యాణ్ పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేస్తున్నారని, ఆయనని చూసి రాష్ట్రంలో మగాళ్ళు అందరూ అలానే చేస్తే అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటని ఓ ఊహాజనితమైన ప్రశ్న అడిగారు.
జగన్కు పవన్ రాజకీయ ప్రత్యర్ధి కనుక రాజకీయంగా ఎదుర్కొని ఉంటే హుందాగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్కు మహిళలంటే చులకన అని చెప్పేందుకు, జగన్ మాట్లాడిన మాటలే ఇంకా ఎక్కువ అవమానకరంగా ఉన్నాయి. ఆ మాటలలో మహిళల పట్ల చులకన భావం కూడా కనబడుతోంది కదా?
జగన్ కూడా తల్లిని, చెల్లిని బయటకు పంపించేశారు. అక్రమాస్తుల కేసుల ఫ్లాష్ బ్యాక్ అందరికీ తెలిసిందే. వివేకా కధలో ఇద్దరు చెల్లెమ్మలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగని ఎవరూ జగన్ను ఫాలో అవలేదు కదా? ఒకవేళ ఫాలో అయితే… అని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించలేవా?
ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబందించిన విషయాలు మాట్లాడరు. మంత్రులు తమ శాఖలకు సంబందించిన విషయాలు మాట్లాడరు. ఈజీ సబ్జెక్ట్… సాఫ్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల గురించి ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడుతారు.
అసలు ఏమీ చేయకుండానే ఐదేళ్ళు లాగించేసి మళ్ళీ మాకే ఓట్లు వేసి గెలిపించమని అడగటమే ఆశ్చర్యమనుకుంటే, పవన్ కళ్యాణ్-మూడు పెళ్ళిళ్ళ స్టోరీ చెప్పి జనాలను నవ్విస్తే చాలు ఓట్లు రాలుతాయని అనుకోవడం ఇంకా విచిత్రమే.




