గత ఎన్నికలలో వైసీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త గా సేవలందించిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ వైసీపీ పాలిట శికండిలా తయారయ్యారు. అలాగే గత వైసీపీ విజయానికి మరో చేయూతనిచ్చిన చెల్లెల్లు షర్మిల, సునీతా ఒక పక్క వైసీపీ ని ‘నిను వీడని నీడను నేనే’ అంటూ వెంబడిస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ పీకే కూడా వైసీపీ ని తగులుకోవడం వైసీపీ ఓటమికి ఇవన్నీ సంకేతాలుగా గోషాస్తున్నాయా…? అనే అనుమానాలు మొదలయ్యాయి.
గడిచిన దశాబ్ద కాలం నుండి పవన్ ను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వైసీపీ అసలు గుట్టు బయట పెట్టారు ప్రశాంత్ కిషోర్. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన కళ్యాణ్ తో పొత్తు కోసం వైసీపీ ఎంత ఆరాటపడిందో…ఆ పార్టీ మద్దతుదారులు ఎంత ఆశపడ్డారో…వైసీపీ కార్యకర్తలకు కూడా అర్ధమయ్యే విధంగా వివరించారు పీకే.
2017 నంద్యాల ఉపఎన్నికల ఓటమి తరువాత దత్తపుత్రుడు అంటూ పొత్తు కోసం వెళ్ళింది ఈ వైస్ పుత్రుడు పార్టీనే అంటూ అసలు వాస్తవాన్ని ప్రజల ముందుంచారు పీకే. ఒక టీవీ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న పీకే ఈ విషయాన్ని బయటపెట్టారు. సింహం సింగల్, మాకు దత్తపుత్రుడు అవసరం లేదు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ వ్యక్తి సమాజానికి చేటు అంటూ బహిరంగ సభల మీద విమర్శిస్తున్న జగన్ అదే పవన్ తో పొత్తు కోసం చేసిన బ్యాక్ డోర్ పాలిటిక్స్ గుట్టు బయటపడింది.
జనసేనతో పొత్తు కోసం వైసీపీ పడిన ఈ ఆరాటాన్ని జనసేన పార్టీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో జనసైనికులు, పవన్ అభిమానులు ఈ వీడియో ను వైరల్ చేస్తూ మీ వన్ సైడ్ లవ్ ను తిరస్కరించిగినందుకా పవన్ పై ఇంత కోపం అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు. అదే పొత్తుకు పవన్ అంగీకరించి ఉంటే రాముడు దేవుడు అంటూ ఈ వైసీపీ బ్యాచ్ పవన్ ను నెత్తినపెట్టెకునే వారుకాదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు జనసైనికులు.
ఇదే విషయాన్ని 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా బహిరంగంగానే వివరించారు. ఇప్పుడు నన్ను తిడుతున్న ఈ వైసీపీ పెద్దమనుషులు మన పార్టీతో పొత్తు కోసం అనేక ప్రయత్నాలు చేసారు. కానీ ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని నేను తిరస్కరించాను అంటూ అప్పట్లో పవన్ వ్యాఖ్యనించారు. ఇప్పుడు ఇదే విషయాన్నిఈ పీకే కూడా నిర్దారించడంతో వైసీపీ లోగుట్టు బయటపడినట్లయింది.
మొన్నేమో ఈ సారి ఎన్నికలలో వైసీపీ ఎట్టి పరిస్థితులలోను గెలవలేదు..,తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే ఇక్కడ జగన్ కు తప్పదు అంటూ వ్యాఖ్యానించిన పీకే..,ఇప్పుడేమో పవన్ తో పొత్తు కోసం ఆరాటపడింది వైసీపీ అంటూ మరో బాంబు పేల్చి జగన్ కు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ ప్రశాంత్. అసలే టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుతో అతలాకుతలమవుతున్న జగన్ కు ఇప్పుడు పీకే కూడా మరో సమస్యల తయారయ్యారు. ‘చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా’…! అంటారు ఇందుకేనా…! అంటూ టీడీపీ – జనసేన పార్టీలు పీకే మాటలను వైరల్ చేస్తున్నారు.






