ఏపీలో వైసీపి అధికారంలోకి రావడానికి, 5 ఏళ్ళు మనుగడ సాగించడానికి కారణం జగన్మోహన్ రెడ్డికి మోడీ, అమిత్ షాల ఆశీర్వాదం ఉండటమే అని అందరికీ తెలుసు. కనుక జగన్ బలం, బలహీనత రెండూ కూడా అదేనని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం చేస్తూ, అరాచక పాలన సాగిస్తున్నా వాటిని మోడీ, అమిత్ షాలు పట్టించుకోకుండా చేయడం జగన్ బలం అనుకుంటే, తమ కేసులు, అప్పుల కోసం వారికి అణిగిమణిగి ఉండిపోతుండటం బలహీనతగా భావించవచ్చు.
కనుక ప్రశాంత్ కిషోర్ చెప్పిన్నట్లు జగన్ వారిపై నమ్మకం పెట్టుకుని మోసపోయారా లేక వారే జగన్ని ఉపేక్షించి ఏపీలో బీజేపీని నష్టపరుచుకున్నారా?రెండూ అని చెప్పుకోవచ్చు.
అయినప్పటికీ మోడీ, అమిత్ షా, జగన్ ముగ్గురూ తమ బంధాన్ని ఇంకా కొనసాగించేందుకే మొగ్గు చూపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
జగన్ కేసులు, అప్పుల కోసమే మోడీ, అమిత్ షాలకు విధేయంగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ టిడిపి, జనసేనలు అమరావతి నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. కనుక ఒకవేళ వాటితో బీజేపీ పొత్తుకి సిద్దమైతే దాని వలన రాష్ట్రానికి, టిడిపి, జనసేన, బీజేపీలకు కూడా మేలు కలుగుతుంది. కనుక ఇది మంచి కాంబినేషన్ అవుతుంది. అయితే బీజేపీ కర్ర పెత్తనం చేయాలనుకోకుండా వాటితో కలిసి పనిచేస్తేనే ‘మంచి కాంబినేషన్’ అవుతుంది.
జగన్ కేంద్రాన్నే కాదు… చెల్లి, తల్లి, సొంత ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరినీ కూడా నమ్మరనే విషయం స్వయంగా బయటపెట్టుకున్నారు. చివరికి తాను నమ్ముకున్న సంక్షేమ పధకాలను కూడా ఇప్పుడు నమ్మడం లేదు. నమ్మి ఉంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాల్సిన అవసరమే లేదు కదా? రాష్ట్రంలో అందరూ తనని నమ్మాలని కోరుకుంటున్న జగన్, ఎవరినీ నమ్మకపోవడం విచిత్రమే కదా?
కనుక జగన్ తనకు తోచిన్నట్లే ముందుకు సాగుతున్నట్లు భావించవచ్చు. అయితే ఆ ప్రయాణంలో అందరినీ వాడుకొంటూ అవసరం తీరాక పక్కన పడేస్తూ ముందుకు సాగిపోతున్నారు అంతే… అని అనుకోవాల్సి ఉంటుంది.
కేసీఆర్ని రాజకీయ గురువుగా భావిస్తున్న జగన్, కుటుంబం విషయంలో ఆయన పద్దతిని పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్ బయటవారిని ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా సొంత తల్లి, చెల్లిని నమ్మి ఉంటే, కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులు అండగా నిలబడుతున్నట్లుగా, నేడు విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా జగన్కు కొండంత అండగా ఉండేవారు కదా? అప్పుడు ఇంత దుస్థితి ఎదురయ్యేదే కాదేమో?




