ఇప్పుడు దేశ రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంటే, అధికారం కోల్పోయిన పార్టీలు కేవలం తమకి మాత్రమే ప్రజల పట్ల ప్రేమ, చిత్తశుద్ది ఉందని గట్టిగా వాదిస్తున్నాయి.
గమ్మతైన విషయం ఏమిటంటే, వాటి పాలన, విధానాలు నచ్చకనే ప్రజలు తమని గద్దె దించారని ఎవరూ ఒప్పుకోవడం లేదు. తమ ప్రత్యర్ధులు మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి లేదా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్నికలలో గెలవడం వలననే తాము ఓడిపోయామని వితండవాదం చేస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, మా పార్టీ, మా ప్రభుత్వం, మా పాలన, మా విధానాలు మాత్రమే అత్యుత్తమైనవని ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ‘వెరీ వెరీ వరెస్ట్’ అని తేలికగా తీసి పడేస్తున్నాయి.
ప్రస్తుతం జగన్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు… ఇలాగే ట్వీట్లేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఎంచుకున్న టాపిక్ ‘వికలాంగుల పించన్లు-చంద్రబాబు నాయుడు మోసం.’ వైసీపీ నేతలందరికీ ఈ లైన్ ఇచ్చారు కనుక జగన్తో సహా అందరూ ఇదే పాట పడుతున్నారు.
ఈరోజు జగన్ ఇదే అంశం మీద సిఎం చంద్రబాబు నాయుడుకి ఓ బహిరంగ లేఖ వ్రాశారు. తన హయంలో 66,34,372 మంది వికలాంగులకి పించన్లు ఇచ్చేవాడినని కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 62,19,472 మందికి మాత్రమే పించన్లు ఇచ్చారని దానిలో ఆరోపించారు.
అంటే ఒకేసారి 4,14,900 మంది వికలాంగులకు పించన్లు కోత విధింఛి చంద్రబాబు నాయుడు వారిని కూడా మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
తాను ఎంతో ఉదారంగా మెడికల్ క్యాంపులు పెట్టించి వికలాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించి వాటితో పించన్లు ఇస్తుంటే, చంద్రబాబు నాయుడు మాకంటే ఎక్కువ మందికే ఇస్తామని అబద్దాలు చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాక 4,14,900 మంది వికలాంగులకు పించన్లు కోత విధింఛి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గుడని జగన్ ఆక్షేపించారు.
అయితే ఇంత పెద్ద లేఖలో తన హయంలో వికలాంగులకు నెలనెలా ఎంత పించన్ ఇచ్చేవరనే విషయం ఎక్కడ ప్రస్తావించలేదు. జగన్ హయంలో రూ.4,000 ఇస్తే, చంద్రబాబు నాయుడు దానిని ఒకేసారి రూ.6,000 కి పెంచి ఇస్తుండటమే ఇందుకు కారణం.
వికలాంగుల పించన్ సొమ్ము పెంచిన చంద్రబాబు నాయుడు వారిని రోడ్డున పడేస్తారని ఎలా అనుకోగలం? కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు తమ అనుచరులకు, బంధు మిత్రులకు వికలాంగుల సర్టిఫికెట్లు ఇప్పించుకొని వారికీ పించన్ ఇప్పించుకున్నారు.
దీని వలన ప్రభుత్వంపై అదనపు భారం పడి అర్హులకు పించన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అటువంటి అనర్హులను గుర్తించి ఏరి పడేసి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.6,000 చొప్పున పించన్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
దీని వలన తాను నిర్మించుకున్న ఓటు బ్యాంక్ తుడిచిపెట్టుకుపోతుందని జగన్ ఆందోళన చెందడం సహజం. అందుకేనేమో ఈ మొసలి కన్నీళ్ళు?




