ఏపీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతుంది అధికార వైసీపీ పార్టీ. సిద్ధం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ఇక చొక్కా మడతపెట్టాల్సిన సమయం ఆసన్నమయింది అంటూ ఇచ్చిన సందేశాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఎలా అమలుపరుస్తున్నారో అనంతపురం రాప్తాడు సభలో జరిగిన ప్రత్యక్ష సంఘటనలే నిదర్శనం గా నిలిచాయి.
రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం మొదలుపెట్టగానే సభలోని కొంతమంది లేచి బయటకు వెళుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ABN విలేకరి, కెమెరామన్ పై వైసీపీ మద్దతుదారులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. కాళ్ళతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో దాడి చేసి సదరు మీడియా ప్రతినిధిని తీవ్రంగా గాయపరిచారు.
వైసీపీ దాడులకు ఇదే మొదలు కాదు ఇక్కడితో అంతము అని చెప్పలేము. గతంలో టీడీపీ పార్టీ కార్యలయం మీద కూడా ఇదే తరహా దాడులకు పాల్పడి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి, అక్కడ పని చేస్తున్న సిబ్బందిని చావ బాదారు వైసీపీ మూకలు. ఇటువంటి దాడులను ముఖ్యమంత్రి గారే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా అనేలా జగన్ వ్యాక్యలు అప్పటిలో సంచలంగా మారాయి.
మా పార్టీ కార్యకర్తలకు బీపీ లు వస్తే ఇలానే దాడులకు తెగబడతారు అంటూ దాడి చేసిన సదరు వ్యక్తులను వెనకేసుకొచ్చారు జగన్. గత వారంలో జరిగిన సిద్ధం సభలో కూడా చంద్రబాబు, పవన్ ఫొటోలతో కూడిన బాక్సింగ్ బ్యాగ్ లను ఉంచి తమ పార్టీ కార్యకర్తలతో వాటి పై దాడి చేసేలా ప్రేరేపించారు ముఖ్యమంత్రి. ఇలా ఎక్కడిక్కడ తమ పార్టీ నేతలను కార్యకర్తలను ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద దాడులకు ఉసిగొలుపుతున్న జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా సిబ్బంది వరకు పాకిందనే చెప్పాలి.
రాబోయే ఎన్నికలు పేదలకు – పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ తమను పేదవారిగా ప్రత్యర్థి పార్టీ నేతలను పెత్తందారులుగా చిత్రీకరిస్తున్న జగన్ ఇలా సామాన్య ప్రజలలో ఒకరైన జర్నలిస్ట్ పై తమ పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండించకపోవడం పేదవారికి మద్దతుగా నిలిచినట్టా..? లేక పెత్తందారీతనాన్ని అమలుపరిచినట్టా…? ఒక ఈనాడు, ఒక టీవీ 5 , ఒక ఆంధ్ర జ్యోతి అంటూ నిత్యం వారి పై ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాటి పై విషం జిమ్ముతూ వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నది ఎవరు..?
ఇలా పదే పదే ఒక వర్గం మీడియాను టార్గెట్ చేస్తూ తన సభలలో ప్రసంగాలు చేస్తున్న జగన్ రాష్ట్రంలో కొత్తగా దాడుల సంస్కృతికి తెరలేపుతున్నారా..? ఎన్నికలకు సమయం దగ్గర పడింది వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు, నేతలు అందరూ ఇక చొక్కాలు మడత పెట్టడానికి రెడీగా ఉండండి అంటూ జగన్ ఇచ్చిన పిలుపుకి పర్యవసానాలే ఈ దాడులా..?అనేలా ఉన్నాయి.
ఒక సొంత పత్రికను, మీడియాను నడుపుతున్న జగన్ మీడియా పై ఇటువంటు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనే చెప్పాలి. టీడీపీ, జనసేన సభలకు కూడా సాక్షి మీడియా ప్రతినిధులు వెళ్ళరా..? అదే సాక్షి మీడియా వారి పై ఇటువంటి దాడి జరిగితే రాష్ట్రాన్ని టీడీపీ, జనసేనలు కలిపి రావణకాష్టంగా మార్చేస్తున్నాయి అంటూ గగ్గోలు పెట్టే ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు మోనంగా దాడికి ఒత్తాసుపలకడం ఎంతవరకు సమంజసం..?
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఈరకమైన భయానక వాతావరణాన్ని సృష్టించి మానసికంగా ప్రత్యర్థులకు కుంగతీసి తమ గెలుపుకి బాటలు వేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నేను సిద్ధం..మీరు సిద్ధమా..? అంటూ చేస్తున్న వ్యాఖ్యలు పరమార్థం నేను రెచ్చకొట్టడానికి సిద్ధం…మీరు రెచ్చిపోవడానికి సిద్ధమా..? నేను దాడులకు మద్దతుగా నిలబడటానికి సిద్ధం…మీరు దాడులు చేయడానికి సిద్ధమా..? అన్నట్లుగా కనపడుతున్నాయి.
అయితే ABN విలేకరి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. ఇటువంటి దాడులను పోలీస్ అధికారులు నియంత్రించలేక పోవడం దురదృష్టకరం, రోజురోజుకి వైసీపీ నేతలలో హింసాత్మక ధోరణులు ఎక్కువైపోతున్నాయి,ఇవి రాష్ట్ర క్షేమానికి అత్యంత హానికరం అంటూ ప్రజాస్వామ్య వాదులంతా ఈదాడిని ఖండించాలని కోరారు. అలాగే టీడీపీ నేతలు పరిటాల శ్రీ రామ్ కూడా మీడియా వారి పై జరిగిన దాడిని ఖండిస్తూ సదరు వ్యక్తిని పరామర్శించారు. ఇది వైసీపీ పిరికితనానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యనించారు.
అయితే తన సభలో ఇంత గోరంగా ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగినప్పటికీ కనీస బాధ్యతగా కూడా జగన్ ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేసింది. అయితే దీనికి కూడా బాబే కారణం అంటూ చెప్పడానికి ఎదో ఒక సాకు కోసం వైసీపీ ఎదురుచూపులు చూస్తూ కాలయాపన చేస్తుందా..?




