అమరావతి మార్పు, మూడు రాజధానుల పై రెండేళ్లుగా జరుగుతున్న రగడ మొత్తానికి ఒక కొలిక్కి వచ్చే సమయం వచ్చింది. ఎప్పుడు అనేది కరెక్ట్ గా తెలియకపోయినా ఆ దిశగా అడుగైనా పడుతుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై రోజు వారీ విచారణకు సిద్ధమైంది. మే 3నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం వింటుంది.
ధర్మాసనం పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం ఆన్లైన్ ద్వారా విచారణ జరిపింది. అనంతరం మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఈ వ్యాజ్యాలపై జరిగిన హియరింగ్లును పూర్తిగా పక్కన పెట్టి, మళ్ళీ మొదటి నుండి వింటాం అని ప్రకటించింది ధర్మాసనం.
దానితో అనుకున్నది అనుకున్నట్టు జరిగినా ఈ తతంగం మరి కొన్ని నెలల పాటు జరగనుంది. అది తేలే వరకు యథాతథ స్థితి కొనసాగించాల్సి ఉండటంతో మే, జూన్ నాటికి రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరిక తీరేలా లేదు.
మరోవైపు… రాజధాని పేరిట జరిగిన ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్జి అభివర్ణించారు. చంద్రబాబు, అతని బినామీలు కారుచౌకగా భూముల్ని కొట్టేశారని ఆరోపించారు. వచ్చింది స్టే మాత్రమే అని చంద్రబాబు తప్పించుకోలేరని ఆయన అన్నారు.





