కృష్ణాజిల్లా ‘హంసలదీవి’ వేదికగా జరిగిన ‘జయ జానకి నాయక’ విజయోత్సవ వేడుకలో తన అనుభూతులను పంచుకున్న జగపతిబాబు… తనను 30 ఏళ్ళుగా భరిస్తున్నందుకు ప్రేక్షకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ ప్రారంభమైన ప్రసంగం చివరికి ఏమోషనల్ గా ముగిసింది. అసలు హంసల దీవి అనే ప్లేస్ ఒకటి ఉందని కూడా తనకు తెలియదని, బోయపాటి శ్రీను ఒక్కసారి తీసుకువచ్చి షూటింగ్ చేసిన తర్వాత, ఈ లొకేషన్ షూటింగ్ స్పాట్ గా మారడానికి చాలా అనుకూలం అంటూ కితాబిచ్చారు.
రెండో వారంలో సినిమా థియేటర్లు మరో 135 పెరిగాయంటే, సినిమా గురించి చెప్పడానికి ఏం లేదని అన్న జగపతిబాబు… “లెజండ్”కి ముందు రెండేళ్ళ పాటు ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో… నా కెరీర్ అయిపోయింది అని అందరు అనుకొన్నారు. సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ చేతిలో పట్టుకొని ఎవడు ఫోన్ చేసి అవకాశం ఇస్తాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో కానీ బోయపాటి ‘జిత్తూ’ అనే అద్భుతమైన పాత్ర ఇచ్చి నన్ను నిలబెట్టాడు. ఆ పాత్రను మించిన స్థాయిలో బాధ్యతను తీసుకుని ఈ సినిమాలో మరో మంచి పాత్రను ఇచ్చాడు.
నిజానికి ‘లెజెండ్’ సినిమాలో వేసింది నా ఒరిజినల్ క్యారెక్టర్… జిత్తూ ఎంత మొండివాడో నేను అంతే మొండోడ్ని.. ఈ సినీ ప్రపంచం వదిలేస్తాడు, ఇండస్ట్రీని వదిలేస్తాడు… అని అంతా అనుకున్నారు… కానీ నేను ఎక్కడికీ వెళ్లను… ఎవర్నీ వదలను… అంటూ ‘జయ జానకి నాయక’ సినిమాలో తన పాత్ర చెప్పిన డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు జగపతిబాబు. బోయపాటి సత్తాకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా విజయోత్సవ వేడుకకు ఇంత దూరం తరలి వచ్చినందుకు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.


