సెప్టెంబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ – బాబీల “జై లవకుశ” సినిమాకు, 27వ తేదీన విడుదల కాబోతున్న “స్పైడర్” రూపంలో టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తేదీకి విడుదల కావడమే ఈ సినిమా సరికొత్త టెన్షన్ గా తెలుస్తోంది. ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది గానీ, ఇందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడమే తాజా ఆందోళనకు కారణం.
సరిగ్గా నెల రోజుల సమయమే ఉన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుండగా, ఈ మూడు పాత్రలు కూడా ఒకే సమయంలో రన్ అవుతుంటాయట. దీంతో గ్రాఫిక్స్ వర్క్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, నాణ్యత రీత్యా చాలా సమయం తీసుకుంటోందట. అనుకున్న సమయానికి, కావాల్సిన క్వాలిటీలో సన్నివేశాలు రావాలంటే కష్టమేమో అన్న టాక్ బలంగా వినపడుతోంది. అదే జరిగితే, దసరా బరిలో నుండి ‘జై లవకుశ’ తప్పుకుంటారేమో అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ ఆదరాబాదరా పూర్తి చేసి విడుదల చేస్తే, నాణ్యత లోపం కనిపిస్తే, మొత్తం సినిమా ఫలితం పైనే అది ప్రభావం చూపుతుందేమోనని భావిస్తున్నారట. దీంతో సెప్టెంబర్ 21వ తేదీ నాటికి ‘జై లవకుశ’ సిద్ధమవుతుందో లేదో అన్న సందేహాలు ఏర్పడగా, ఈ నెలఖారికి గానీ, సెప్టెంబర్ మొదటి వారానికి దీనిపై పూర్తి స్పష్టత వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాబీ గత చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొని, చివరికి రెండు చోట్ల షూటింగ్ జరిపి, అనుకున్న సమయానికి విడుదల చేసిన విషయం తెలిసిందే.


