ఏపీలో జనసేన ముద్దు.. తెలంగాణలో వద్దే వద్దు!

Jana Sena BJP alliance faces Telangana hurdle

ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో బంధం మరింత బలపడాలని టీడీపి కోరుకుంటోంది. వాటి ఫెవీకాల్ బంధాన్ని విడగొడితే తప్ప అధికారం చేజిక్కించుకోవడం కష్టమని వైసీపీ భావిస్తోంది. కనుక విఫలయత్నాలు చేస్తూనే ఉంది.

కానీ తెలంగాణలో బిజేపి నాయకులు మాత్రం జనసేనతో పొత్తు అవసరం లేదని పదేపదే చెప్తుండటం విశేషం. త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరుగబోతున్నాయి.

ADVERTISEMENT

కనుక “జనసేనతో బిజేపి పొత్తు పెట్టుకుంటుందా?” అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఏమన్నారంటే, “తెలంగాణలో బిజేపి ఒంటరిగానే పోటీ చేస్తుంది. జనసేనతో సహా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. బిజేపి, జనసేనలు ఎన్డీయేలో భాగస్వాములు మాత్రమే. తెలంగాణలో కాదు,” అని స్పష్టం చేశారు.

అయితే ఏపీలో జనసేనతో టీడీపి, బిజేపిలు కలిసి సాగుతున్నప్పుడు, జనసేనతో పొత్తుని తెలంగాణ బిజేపి నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఏపీలో రాజకీయాలు, రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణలో వేరు కనుకనే.

తెలంగాణలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. మజ్లీస్ పార్టీ వారికి ప్రతినిధిగా భావిస్తుంటారు. కనుక అక్కడ హిందూ ఓటర్లు ముఖ్యంగా… ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన హిందూ ఓటర్లు ఖచ్చితంగా బిజేపి వైపే మొగ్గు చూపుతారు.

కనుకనే గత జిహెచ్‌ఎంసి ఎన్నికలలో బిజేపి ఒంటరిగా పోటీ చేసినా మజ్లీస్ పార్టీపై కత్తులు దూస్తూ 55 సీట్లు సొంతంగా సాధించుకోగలిగింది. కనుక జనసేన అవసరం లేదని భావించడం సహజమే.

పైగా పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ఏపీ డెప్యూటీ సిఎంగా ఉన్నారు. కనుక ఆయనపై ‘ఆంధ్రా ముద్ర’ మరింత బలంగా ఉంది. కనుక ఒకవేళ జనసేనతో బిజేపి పొత్తు పెట్టుకున్నట్లయితే, బీఆర్ఎస్‌ పార్టీ ఇదే ప్రచారం చేస్తే బిజేపి నష్టపోతుంది. కనుక ఇదీ ఓ కారణమై ఉండవచ్చు.

ఇప్పుడు జనసేన పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే శాసనసభ ఎన్నికలలో బిజేపితో పొత్తు పెట్టుకున్నా జనసేన ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఒంటరిగా బరిలో దిగి నెగ్గుకు రాగలదా? డౌటే!

కనుక ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది పవన్ కళ్యాణ్‌.. జనసేన తెలంగాణ నాయకులే తప్ప బిజేపి కాదు.

 

ADVERTISEMENT
Latest Stories