జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ్ళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో, పొత్తులు… సీట్లు… పదవుల గురించి మాట్లాడారు.
“జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు సైతం పొత్తులతో బలపడ్డాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా పొత్తులతో బలపడ్డాయి. ఎన్నికలలో లబ్ది పొందాయి. కనుకనే జనసేన కూడా బిజెపి, టిడిపిలతో పొత్తులు పెట్టుకొంది. భవిష్యత్లో కూడా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తాము. రాష్ట్రంలో వైసీపీ నుంచి అధికారాన్ని గుంజుకొని ప్రజలకు అప్పగించేందుకే ఈసారి పొత్తులు పెట్టుకొంటాము. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాము. పొత్తులు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసంకాగా, సీట్లు మా పార్టీకి ఉన్న బలాన్ని బట్టి అడుగుతాము తప్ప దురాశకు పోదలచుకోలేదు.
ఒకవేళ గత ఎన్నికలలోనే మా పార్టీకి ప్రజలు 40 సీట్లు ఇచ్చి ఉండి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి పదవిని అడిగేవాళ్ళం. పార్టీ బలాన్ని బట్టే సీట్లు, వాటిని బట్టే పదవులు ఉంటాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జనసేన పార్టీ చాలా బలపడింది. కొన్ని జిల్లాలలో మాకు పూర్తి బలం ఉండగా కొన్ని చోట్ల మాకు బలం లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడను. కనుక మేము తప్పకుండా గెలుస్తామని అనుకొన్న సీట్లనే కోరుకొంటాము.
వామపక్షాలతో కలిసి సాగాలనే నాకుంది. కానీ వాటి లెక్కలు, సిద్దాంతాలు వాటికి ఉంటాయి. కనుక వాటిని మాతో కలవాలని ఒత్తిడి చేయను గానీ వైసీపీని గద్దె దించడానికి అందరూ గట్టి ప్రయత్నాలు చేయాలని మాత్రం కోరుకొంటున్నాను. ఇక ముఖ్యమంత్రి పదవి ఇమ్మనమని టిడిపిని లేదా బిజెపిని అడగాల్సిన అవసరం లేదు. ముందు మా బలం నిరూపించుకొంటే పదవులు వాటంతట అవే వస్తాయని భావిస్తున్నాను,” అని అన్నారు.
టిడిపితో కలిసి పనిచేయాలనుకొంటున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టంగానే చెపుతున్నారని అర్దమవుతోంది. బహుశః మే 13న వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారేమో? అప్పుడు బిజెపి-జనసేనల పొత్తులు కొనసాగుతాయా లేదా అనే దానిపై స్పష్టత రావచ్చు.



