విశాఖ ఎస్.రాజా గ్రౌండ్స్ లో జరిగిన జనసేన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు తాలూకా ఆవశ్యకతను, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల గురించి ప్రజలకు వివరించారు.అలాగే తన ప్రాణమున్నంత వరకు జనసేన పార్టీ నిలబడే ఉంటుందని, దానిని ఏ పార్టీలో విలీనం చేసేది లేదని పవన్ పార్టీ అభిమానులకు తెగేసి చెప్పారు.
టీడీపీ పార్టీ వెనుక జనసేన నడవడం లేదని, టీడీపీ తో కలిసి పని చేయడానికి మాత్రమే సిద్ధమయ్యామని, పార్టీ అభిమానులు, ప్రజలు అర్ధం చేసుకుని ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయాలంటూ సందేశమిచ్చారు. “యదా రాజా తదా ప్రజా” అన్న చందంగా “యదా ప్రభుత్వం తదా అధికారులు” అన్నట్లుగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తుందన్నారు.
ప్రజా సమస్యల మీద ద్రుష్టి పెట్టాల్సిన ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఉద్యోగులు తన సినిమా టిక్కెట్ల నియంత్రణ మీద ద్రుష్టి పెడుతున్నారని, ఇటువంటి చిల్లర వేషాలు వైసీపీ ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహిస్తుందంటూ వైసీపీ ప్రభుత్వం పై తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు.రాబోయే జనసేన – టీడీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజాహితానికే వారిని వినియోగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
అలాగే సీఎం…సీఎం..అంటూ నినాదాలు చేస్తున్న పవన్ అభిమానులకు, పార్టీ నేతలకు పవన్ ఒక క్లారిటీ ఇచ్చారు. “మనకెంత బలమో మనకు అంతే హక్కు” ఉంటుందని గుర్తిచాలి. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తే సరిపోదు. ఈ అభిమానమంతా ఓట్ల రూపంలో మారాలి. పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలి.అలాగే పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థికి ఓట్ల బదలాయింపు జరిగి వారికి తమ మద్దతు తెలియచేయాలి.
అప్పుడే ఈ సీఎం..సీఎం అంటూ ఇచ్చే నినాదాలకు న్యాయం చేయగలుగుతారు అంటూ జనసేన క్యాడర్ కు తమ బాధ్యతను మరోసారి గుర్తుచేశారు.గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పవన్ తన పార్టీ అభిమానులకు కూడా వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు.మన బలమెంతో పక్క పార్టీకి చూపించకుండా మన ఆశలు నెరవేర్చుకోవాలంటే అది సాధ్యమయ్యే పనికాదని తెలిసిన పవన్ అదే విషయాన్ని తన అభిమానులకు తెలియచేసారు.
ఇప్పటికైనా నినాదాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చి “తమ బలమెంతో ప్రత్యర్దులకే కాదు మిత్ర పక్షానికి” కూడా రుజువుచేయాల్సిన సమయం ఇకెంతో దూరంలో లేదనేది జసైనికులు, పవన్ అభిమానులు ఇప్పటికైనా గ్రహించాలి.




