జనసేన పార్టీ అధికారిక గుర్తింపైన గాజుగ్లాసు ను ఈసీ ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టడం అటు జనసేనతో పాటు ఇటు కూటమి పార్టీలకు కూడా ఎదురుదెబ్బగానే భావించాలి. రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు, జనసేన రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగబోతున్న పలువురు నేతలకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో హైకోర్టు ను ఆశ్రయించింది జనసేన.
అయితే దీని పై విచారణ చేపట్టిన కోర్ట్ జనసేనకు కొంత మేరకు మాత్రమే ఊరట కలిగించింది. ఏపీలో పొత్తు కారణంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీలో నిలబడింది. అయితే ఇందులో మచిలీపట్నం, కాకినాడ రెండు పార్లమెంట్ స్థానాలలో జనసేన బరిలో ఉంది. ఈ రెండు ఎంపీ స్థానాల పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమంటూ ఈసీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది.
దీనితో జనసేనకు కాస్త పాక్షిక ఊరడింపు దొరికినప్పటికీ ఇది కూటమి గెలుపుకి ప్రమాదమే. ఆ రెండు జనసేన పార్లమెంట్ స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలలోను గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశమే కనపడుతుంది. దీనితో కూటమి పార్టీల మధ్య ఓట్లు చీలే ప్రమాదం ఎక్కువగా కనపడుతుంది. రెండు పార్టీలకు కీలకంగా మారిన ఈ ఎన్నికలలో చీలే ఒక్క ఓటు కూడా కూటమికి అత్యంత ప్రమాదకరమే.
గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ధి అంటూ వైసీపీ కి కౌంటర్ వేస్తున్న పవన్ కు గాజు కు రెండు వైపులా పదునుంటుంది అని ఈసీ నిరూపించినట్టుంది. గాజు గ్లాస్ పవన్ చెపుతున్నట్లు అటు వైసీపీ ని ఎలా అయితే చీలుస్తుందో, ఇటు కూటమిని కూడా అదే విధంగా బాధపెడుతుంది అంటూ ఆందోళన చెందుతున్నారు టీడీపీ, జనసేన నేతలు. మరి ఈ పొంచి ఉన్న ప్రమాదం నుండి టీడీపీ, జనసేనలు ఎలా బయటపడుతాయో వేచి చూడాలి.






