వైసీపీకి ఈ పోస్టర్స్ పిచ్చి ఏమిటో? జనసేన గడ్డి పెడుతోందిగా?

Janasena Posterజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ హుందాగానే వ్యవహరిస్తుంటారు కనుక తన పార్టీలో అందరూ కూడా అలాగే నడుచుకోవాలని చెపుతుంటారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవిదంగా వ్యవహరించవద్దని పార్టీ కార్యకర్తలకు సభాముఖంగానే చెపుతుంటారు కూడా.

అయితే ప్రతిపక్ష పార్టీ పద్దతిగా ఉండాలనుకొంటున్నా, అధికార వైసీపీ పదేపదే అవమానిస్తూ, కవ్విస్తుండటంతో జనసేన కూడా మెట్టు దిగి వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పక తప్పడం లేదు. వైసీపీ నేతలకి మొదటి నుంచి పోస్టర్స్ పిచ్చి కాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే వారు తమని తాము అభినందించుకొంటూ ఎన్ని పోస్టర్స్ పెట్టినా ఎవరూ అభ్యంతరం పెట్టరు కానీ ప్రతిపక్ష పార్టీలను ఎద్దేవా చేస్తూ పెడుతుండటం వలననే ప్రతిపక్షాలు కూడా స్పందించక తప్పడం లేదు.

ADVERTISEMENT

తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగం చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌ని విమర్శిస్తూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టింది. దానిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ పల్లకీలో కూర్చొని ఉండగా పవన్‌ కళ్యాణ్‌, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ తదితరులు మోస్తున్నట్లు, వారి వెనుక సంపన్నవర్గాలవారు సామాన్య ప్రజలపై దాడి చేసేందుకు వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వారికి అడ్డుగా నిలిచి ప్రజలను కాపాడుతున్నట్లు దానిలో చూపారు. దీనికి టిడిపి, జనసేనలు సోషల్ మీడియాలోనే ఘాటుగానే జవాబు ఇచ్చాయి.

ఇటువంటి దిగజారుడు పనులనే వైసీపీ నేతలు గొప్ప వ్యూహాలుగా భావిస్తున్నట్లున్నారు. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోను ఫ్లెక్సీ బ్యానర్‌పై ముద్రించి విశాఖపట్టణంలోని ఆనందపురం మార్కెట్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేశారు. జనసేన కార్యకర్తలు ధీటుగా స్పందిస్తూ, వారు కూడా సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫోటోను ఫ్లెక్సీ బ్యానర్లపై ముద్రింపజేసి వాటికి సమీపంలో పెట్టారు.

దానిలో ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి పల్లకీలో కిరీటం పెట్టుకొని కూర్చోగా, మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని, అధికారులు, పోలీసులు “కొత్తా దేవుడండి కొంగ్రొత్తా దేవుడండి…” అనే పాటను పాడుకొంటూ పల్లకీని మోస్తున్నట్లు చూపారు. పైన హెలికాఫ్టర్‌లో డబ్బు నింపిన సూట్ కేసులను తీసుకువెళుతున్నట్లు చూపారు.

సహజంగానే ఆ పోస్టర్‌ చూసి వైసీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. జనసేన ఏర్పాటు చేసిన ఆ పోస్టర్స్ చించేసేందుకు ప్రయత్నించగా, జనసేన కార్యకర్తలు కూడా వైసీపీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ చించేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మద్య ఘర్షణ జరుగుతుంటే, పోలీసులు కలుగజేసుకొని ఆ పోస్టర్స్ తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ వైసీపీ నేతలు అడ్డుకోవడంతో జనసేన పోస్టర్స్ తొలగించేందుకు ప్రయత్నించారు. వైసీపీ పెట్టిన పోస్టర్స్ తొలగించకుండా తమవి తొలగించడానికి వీల్లేదంటూ వారూ పోలీసులను అడ్డుకొన్నారు. దీంతో అతికష్టం మీద ఇరువర్గాలకు నచ్చజెప్పి పోస్టర్స్ తొలగించారు.

ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలనుకొంటునప్పటికీ, అధికార పార్టీ హుందాగా వ్యవహరించకపోవడం వలననే ఈ సమస్య తలెత్తిందని అర్దమవుతూనే ఉంది. కనుక దీనిలో నీతి ఏమిటంటే, అధికారం చేతిలో ఉంది కదా అని అద్దాల మేడలో కూర్చొని పరులపై రాళ్ళు విసరకూడదు. విసిరితే ముందుగా నష్టపోయేది అద్దాల మేడలో కూర్చోన్నవారే అని గ్రహిస్తే మంచిది. ప్రజలను ఆకర్షించేందుకు ఇటువంటి చవుకబారు పనులు చేస్తే ప్రజలు కూడా అసహ్యించుకొంటారని మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories