ఈసారి పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాసనసభకు పోటీ చేయబోతుండటంతో, అందరి దృష్టి ఆ నియోజకవర్గం మీదే ఉంది. అక్కడి నుంచి వైసీపి అభ్యర్ధిగా వంగా గీత పోటీ చేయబోతున్నారు.
ఈసారి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు ముగ్గురినీ వారి నియోజకవర్గాలలోనే ఓడించి టిడిపిని దెబ్బ తీయాలని జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేసి, అమలు చేస్తున్నారు.
అదేవిదంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను కూడా మళ్ళీ ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని సమాప్తం చేయాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక మిధున్ రెడ్డికి ఆ బాధ్యత అప్పజెప్పి, రూ.100-150 కోట్లు పంచి పెట్టడానికి సిద్దం అయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
పిఠాపురంలో పద్మశాలి, మత్స్యకార కుటుంబాలున్నాయి. వారందరికీ సంక్షేమ పధకాలు అందిస్తున్నందున వారందరూ వైసీపీకే ఓట్లు వేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో సుమారు 90 వేలకు పైగా కాపు ఓటర్లున్నారు. వారిలో కూడా చాలా మందికి సంక్షేమ పధకాలు అందాయి. కనుక వారందరినీ ముద్రగడ పద్మనాభం ద్వారా వైసీపివైపు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండరని, మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి వెళిపోతారని వైసీపి, ఐప్యాక్ జోరుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కనుక పవన్ కళ్యాణ్ని అన్నివైపులా ముట్టడించి ఓడించేందుకు వైసీపి గట్టి ప్రయత్నాలే చేస్తోందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితులలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ఇంత పగతో రగిలిపోతున్నారు ఆయనే ఈ ఎన్నికలలో ఆయనే వంగా గీతని గెలిపించుకుంటారని చెప్పవచ్చు. ఈ ధైర్యంతోనే తన ప్రమేయం లేకుండానే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తానని వైసీపి అభ్యర్ధి వంగా గీత గట్టి నమ్మకంతో ఉన్నట్లు అర్దమవుతోంది.
ఒకవేళ ఆమె ఓడిపోయినా ఆమెకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ గెలిస్తే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించారనే క్రెడిట్ లభిస్తుంది.
ఆమె వైసీపిలో ప్రముఖరాలు కాదు. ఓ సామాన్య నేత మాత్రమే. కనుక పవన్ కళ్యాణ్ ఆమెపై గెలిచినా అదేమీ విశేషం కాబోదు. కానీ ఆమె చేతిలో ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ పరువు పోవడమే కాకుండా, జగన్ కోరుకున్నట్లుగా ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఈ విషయం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నేతలందరికీ తెలుసు. కనుక ఈసారి ఎట్టి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన గెలుపుకి కీలకంగా మారబోతున్న కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు టిడిపికి కూడా చాలా ముఖ్యం. కనుక టిడిపి నేతలు కూడా పిఠాపురం నియోజకవర్గంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో?




