తెలుగుదేశం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి తొలుత వైసీపీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితుల రీత్యా టిడిపిలోకి రావడం, ఎంపీ కావడం జరిగిపోయాయి. అయితే ముందుగా అనుకున్న వైసీపీలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే… జగన్ డబ్బులు అడగడం వల్లనే అన్న టాక్ అప్పట్లో రాజకీయ వర్గాల్లో హల్చల్ చేసింది. ఇదే విషయమై తాజాగా ఓ మీడియా ఛానల్ ప్రశ్నించిన సందర్భంలో…
“తనను డబ్బు అడిగే ధైర్యం జగన్ కు లేదని, అప్పటి పరిస్థితుల రీత్యా తాను టీడీపీలోకి వెళ్లానని, తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే అయినా, అంతిమయాత్ర మాత్రం టీడీపీలోనేని, ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని” కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పి తాను పార్టీ మారలేదని… ఆ పార్టీ చచ్చిపోయిందని, కుళ్లి కంపుకొడుతోందని, ఘాటు విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ నోటి వెంట ‘మహానేత’ అనే మాట తప్ప ఇక వేరే ఏదీ వినపడదని, గెలిస్తే ఏం చేస్తామనే విషయం మాట్లాడడని, జగన్ కు సీఎం అయ్యే లక్షణాలు లేవని తేల్చేసారు జేసీ.
వైసీపీ అధినేత జగన్ హండ్రెడ్ పర్సెంట్ ‘రెడ్డి’ కాదని, ‘క్రిస్టియన్’ అని తాను నిఖార్సయిన ‘రెడ్డి’ కులస్తుడినని, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా చెబుతానని అన్నారు. అదే విధంగా రఘువీరారెడ్డి కూడా ‘రెడ్డి’ కాదని, అయినా 21వ శతాబ్దంలో, రేపోమాపో చంద్రుడిపైకి వెళ్లి కాపురాలు పెట్టనున్న పరిస్థితుల్లో ఇంకా కులానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమనేది కరెక్టు కాదని, రాజకీయంగా ఎవరికైనా, ఎప్పుడైనా వారి మనసులో తన కులం పైన అభిమానం ఉండవచ్చని, అయితే, రాజకీయాల్లో ఈ అస్త్రం పనికిరాదని, అది వారిని నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు.


