ఓటమి భయం ఎవరికి… వైసీపి లేదా టిడిపి, జనసేనలకా?

AP Politics YSRCP TDP Janasena

నేడు తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. తెలంగాణలో లక్షలాదిమంది ఆంధ్రా ప్రజలు స్థిరపడి ఉన్నారు. కనుక వారిలో చాలామంది అక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. అయితే వారిలో సుమారు 16 లక్షల మంది ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా ఓట్లు వేస్తున్నారని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. కనుక తెలంగాణలో ఓట్లు వేస్తున్న వారందరూ మళ్ళీ ఏపీ శాసనసభ ఎన్నికలలో ఓట్లు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం ఇచ్చారు.

ADVERTISEMENT

తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, “రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకోవడం చట్ట ప్రకారం నేరం. సుమారు 16 లక్షల మంది ఈవిదంగా రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. దీనికి సంబందించి సాక్ష్యాధారాలను ఎన్నికల సంఘానికి ఇచ్చాము.

మా ప్రభుత్వం లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తోందని, లక్షల సంఖ్యలో టిడిపి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తోందని, టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేస్తున్నారు. వైసీపి చేతిలో ఓడిపోతామనే భయంతోనే వారు మా ప్రభుత్వంపై ఈవిదంగా బురద జల్లుతున్నారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ వైసీపియే గెలుస్తుంది. జగన్మోహన్‌ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు,” అని అన్నారు.

అంటే తెలంగాణలో ఆంధ్రా ఓటర్లందరూ టిడిపి, జనసేనలకే ఓట్లు వేస్తారని వైసీపి గట్టిగా నమ్ముతోందన్న మాట! తెలంగాణలో వైసీపి మద్దతుదారులు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు మరి వారిని కూడా ఏపీకి రాకుండా అడ్డుకోవాలని వైసీపి కొరుకొంటోందా?

ఏపీలో పనిచేస్తూ తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకొనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నేడు సెలవు ఇస్తోంది. మరి తర్వాత వారు ఏపీలో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా వైసీపి అడ్డుకొంటుందా?

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లందరూ వచ్చి ఓట్లు వేసి వైసీపిని గెలిపించాలని గత ఎన్నికలలో వైసీపి నేతలు కోరారు. తెలంగాణలోని వైసీపికి ఓట్లు వేస్తారనుకొనే వారిని రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. కనుక ఈసారి కూడా వైసీపి అదే చేయకుండా ఉంటుందా?

మరో ముఖ్య విషయం ఏమిటంటే, తెలంగాణలో ఓట్లు వేస్తున్న ఆంధ్రా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చామని మంత్రులే స్వయంగా చెప్పుకొన్నారు. అంటే వాలంటీర్ల ద్వారా వైసీపి ప్రభుత్వం వారి సమాచారాన్ని సేకరించిందని కూడా స్పష్టమవుతోంది. మరి వైసీపి ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు?ఓడిపోతామనే భయంతోనే కదా?

ADVERTISEMENT
Latest Stories