2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలో శిధిలమైన రాష్ట్ర రాజధాని అమరావతికి తిరిగి ప్రాణం వచ్చినట్టే, రాష్ట్రంలో సంచలనంగా మారిన వివేకా, సుగాలి ప్రీతి హత్య కేసులకు కూడా త్వరలో న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగింది.
వైస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైస్ వివేకా దారుణ హత్యను గుండె పోటు, నారాసుర రక్త చరిత్ర, సీబీఐ అంటూ రకరకాలుగా వైసీపీ దారులు మళ్లించాలని చూసినప్పటికీ ఆ గొడ్డలి వేటు రక్తపు మరకలు మాత్రం వైసీపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి, ఆ హత్య ఆరోపణల్ని వైఎస్ కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతున్నాయి.
అవినాష్ రెడ్డే నేరస్తుడు అంటూ వివేకా కుమార్తె సునీత నుంచి జగన్ సోదరి షర్మిల వరకు అవినాష్ ను టార్గెట్ చేస్తూ అందుకు తగ్గ ఆధారాలు సెల్ టవర్ సిగ్నల్స్ ను సైతం చూపిస్తున్నారు.
అయినా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేకా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు సరికదా, ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి చుట్టూ జగన్ అనే బలమైన కవచం తో పాటుగా వైసీపీ అధికారం అనే భద్రత కూడా వివేకా కేసుని నీరు కార్చింది, బాధితులను కేసులలో ఇరికించింది.
అయితే ఈ వివేకా కేసులో సునీత కు న్యాయం జరగాలి, హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటూ గత ఐదేళ్లు టీడీపీ జగన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టింది. దోషులకు కొమ్ముకాస్తూ బాధితులను కేసులో ఇరికిస్తూ జగన్ అండ్ కో వివేకా కుటుంబం పై రాజకీయ కక్ష్య సాధిస్తున్నారు అంటూ నాడు ఆరోపించిన టీడీపీ నేడు ప్రభుత్వంలోకి వచ్చింది.
వైసీపీ అధికారం అనే కోటను బద్దలుకొట్టిన టీడీపీ ప్రభుత్వంలోకి రావడంతో ఇప్పుడైన వివేకా కేసు కు ఒక ముగింపు పడుతుంది, అసలు దోషులు కటకటాల వెనక్కి వెళతారు అనుకుంటే ఇప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా ఇంకా వివేకా కేసు విషయంలో అసలు వాస్తవాలు బయటకు రాలేదు, సునీత ఆరోపిస్తున్న వ్యక్తులు లోపలికి పోలేదు.
వివేకా కేసు విచారణ పూర్తియిందంటూ అధికారులు ప్రకటించినప్పటికీ సునీత పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కిందా లేదా అన్నది ఇంకా జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇక్కడ కూటమి రాకతో సునీతకు దక్కిన ఒకేఒక్క ఉపశమనం గతంలో సునీత ఆమె భర్త మీద పెట్టిన కేసులను కోర్ట్ కొట్టేయడమే.
వివేకా కేసు ఇలా ఉంటే ఇక పద్నాలుగేళ్ల గిరిజన బాలికను అత్యంత కిరాతకంగా ఆత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కూడా ఏపీలో మరో సంచలంగా మారింది. అయితే వీటి మూలలను కూడా గత వైసీపీ ప్రభుత్వం చుడిచి పెట్టేసిందా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నారు జనసేన అధినేత పవన్.
సుగాలి ప్రీతి హత్యకు గాను ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి, వారి పోరాటాలకు ఫలితం దక్కాలి అంటూ నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి తల్లితండ్రులకు మద్దతు ప్రకటించడం తో పాటు వైసీపీ ప్రభుత్వం పై తనవంతు పోరాటం చేసిన పవన్ నేడు అధికారంలోకి వచ్చారు.
దీనితో ఈ కేసు బాధ్యత జనసేన అధికారానికి చుట్టుకుంది. జనసేన ప్రభుత్వంలో భాగమయ్యి ఏడాదిన్నర గడుస్తుంది, పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినా సుగాలి ప్రీతి కేసు ముందుకు సాగడం లేదు అంటూ పవన్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ జనసేన మీద విమర్శనా బాణాలు పడ్డాయి.
అయితే సేనతో సేనాని అంటూ విశాఖలో జరుగుతున్న మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న పవన్ సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించారు. జనసేన పోరాటం ఫలితంగానే బాధిత కుటుంబానికి పంట భూమితో పాటు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని, అయినా అది సుగాలి కేసుకి న్యాయం కాదని, దోషులకు శిక్ష పడడమే సుగాలికి అసలైన న్యాయమని చెప్పిన పవన్,
ఆ కేసు తాలూకా సాక్ష్యాల్ని గత వైసీపీ ప్రభుత్వం డబ్బుతో, అధికారంతో మాయం చేసేసింది, వివేకా హత్య కేసు విషయంలో కూడా వైసీపీ ఇదే తరహా విధానాలతో కేసుని దోషుల వైపుకి వెళ్లకుండా చేసిందంటూ ఆరోపించారు. అయితే గత వైసీపీ ఈ రెండు కేసులలో ఉన్న రక్తపు మరకలను, సాక్ష్యాధారాలను తన అధికారం తో తుడిచేసినా అవి టీడీపీ ని జనసేనను వెంటాడుతూనే ఉంటాయి.
ఈ రెండు కేసులలో అసలు దోషులెవరన్నది కూటమి సమాజానికి నిరూపించలేకపోతే టీడీపీ లేవనెత్తిన “హూ కిల్డ్ బాబాయ్” అనే ప్రశ్న ఒక రాజకీయ విమర్శకే పరిమితం అవుతుంది, జనసేన భుజాన మోసిన సుగాలి ప్రీతి కేసు ఎన్నికల ప్రచారంలో భాగంగానే పరిగణించబడుతుంది. ఈ రెండు కేసులలో అసలు వాస్తవాలు బయటకొస్తే టీడీపీ, జనసేన చిత్తశుద్ధి తో పాటు వైసీపీ అరాచకం కూడా బట్టబయలవుతుంది.




