ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అధికార వైసీపికి ఊహించని సవాళ్ళు ఎదురవుతున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మళ్ళీ కడప నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఆయనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవినాష్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇద్దరినీ బేరీజు వేసుకుంటే కడప ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో తేలికగానే ఊహించుకోవచ్చు.
అవినాష్ రెడ్డిని వెనకేసుకువస్తున్న కారణంగా ఆయనను మళ్ళీ గెలిపించుకోవడం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది. అంటే కడపలో ఈసారి అన్నా చెల్లెళ్ళ మద్య ప్రత్యక్ష యుద్ధం జరుగబోతోందన్న మాట!
ఇటువంటి సమయంలోనే జగన్ మరో సోదరి (వివేకా కుమార్తె) సునీతా రెడ్డి కూడా వైఎస్ షర్మిలకు మద్దతుగా అన్నపై యుద్ధం ప్రకటించారు.
ఆమె నిన్న అమరావతిలో ప్రెస్మీట్ నిర్వహించి “మా తండ్రి వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో? ఎందుకు చేయించారో సామాన్య ప్రజలందరికీ తెలుసని మీరు (జగన్మోహన్ రెడ్డి) చెప్పినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న మీకు కూడా తెలిసే ఉంటుంది కదా?కనుక ఓ అన్నగా కాకపోయినా ఓ ముఖ్యమంత్రి మా తండ్రిని హత్య చేసింది ఎవరు?ఎందుకు చేయించారో చెప్పండి.
హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మీరు ఎందుకు వెనకేసుకువస్తున్నారో చెప్పండి. ఆయన నోరు విప్పితే మరింకేమైన కొత్త విషయాలు బయటపడతాయని భయపడుతున్నారా?నా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను.
మా నాన్నగారి హత్య కేసు గురించి మాట్లాడిన ప్రతీసారి మీరు భావోద్వేగంతో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. భావోద్వేగాలతో ప్రజలను ఒకసారి మభ్యపెట్టవచ్చు. కానీ ప్రతీసారి సాధ్యపడదు. ఈ హత్య కేసు గురించి నేను మీ సాక్షి మీడియా స్టూడియోకి వచ్చి మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నాను. మీ సొంత మీడియా స్టూడియోకి మీరు రాగలరా?అక్కడే… కెమెరా ముందే మా నాన్నగారి హత్య గురించి ముఖాముఖీ మాట్లాడుదాము,” అంటూ సునీతా రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు.
ఈ సందర్భంగా ఆమె కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమెకు మద్దతు ప్రకటించారు. అంటే కడపలో ఇద్దరు చెల్లెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని అవినాష్ రెడ్డిని గెలిపించుకోవలసి ఉందన్న మాట!
జగన్మోహన్ రెడ్డికి మొదటి పరీక్ష ఇద్దరు చెల్లెళ్ళను తన సొంత గడ్డ కడపలోనే ఎదుర్కోవలసి రావడం. రెండో పరీక్ష రేపు ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నలు, ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోవడం. మూడో పరీక్ష అవినాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవడం.
కడపలో జగన్మోహన్ రెడ్డికి ఎంత పట్టు ఉందో, వైఎస్ షర్మిల, సునీతారెడ్డిలకు కూడా ప్రజలలో అంతే ఆధరాభిమానాలు ఉన్నాయి. కనుక ఎన్నికల ప్రచారంలో వారిద్దరినీ కాదని అవినాష్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలని ప్రజలకు నచ్చజెప్పుకోవడం చాలా చాలా కష్టమే. గెలిపించుకోలేకపోతే అందుకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
మరో విషయం ఏమిటంటే కడప లోక్సభ పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయబోతున్న పులివెందుల కూడా ఉంది. కనుక కడప లోక్సభ ఎన్నికల ప్రచార ప్రభావం పులివెందులపై కూడా తీవ్రంగా ఉంటుంది. అదే కనుక జరిగితే పులివెందుల శాసనసభ ఎన్నికలలో జగన్ కూడా ఎదురీదవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.




