జైల్లోనే కవిత… ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌

Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీ తిహార్ జైల్లోనే ఉన్నారు.

ఇది వరకు విచారణకు రమ్మనమని ఈడీ పిలిస్తే ఆమె నానా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జైల్లో ఉండగానే ఈడీ, సీబీఐలు ఆమెను పరస్పరం మార్చేసుకొంటున్నాయి.

ADVERTISEMENT

తొలుత ఈడీ అధీనంలో ఉన్న ఆమెను తర్వాత సీబీఐ అధీనంలోకి తీసుకొంది. కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండానే తనను ఏదో వస్తువు లేదా బొమ్మ అన్నట్లు ఈడీ, సీబీఐలు పరస్పరం మార్చుకొంటున్నాయని ఆమె ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు.

ఇక జైలుకొస్తే బెయిలు ఎపిసోడ్స్ చాలానే ఉంటాయి. ఇప్పటికే ఓ నాలుగైదు ఎపిసోడ్స్ జరిగిపోయాయి. నేడు తాజా ఎపిసోడ్‌ మరో 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌తో ముగిసింది. ఆమెతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు కూడా రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. కోర్టులో వారి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు, ఏపీలో జగన్‌ ప్రసంగాల మాదిరిగానే చాలా రొటీన్‌గా సాగాయి.

అక్కడ ఢిల్లీలో కవిత ఒంటరిగా ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే, తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌ ఎవరూ కూడా ఆమెను ఓదార్చే పరిస్థితిలో లేరు. మరో నెల రోజులలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఇద్దరూ ఆ బాధను పంటి బిగువున అదిమిపట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనక తప్పడం లేదు.

అప్పటికీ కేసీఆర్‌ మొన్నోసారి నా కూతురు కవితని అన్యాయం అరెస్ట్ చేశారని బాధపడ్డారు. బీజేపీ సీనియర్ నేత, మోడీకి రైట్ హ్యాండ్ బిఎల్ సంతోష్‌కి నోటీసులు ఇచ్చేందుకు తాను తెలంగాణ పోలీసులను ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి పంపినందుకు ‘దుర్మార్గుడు మోడీ’ కక్ష కట్టి నా కూతురిని అరెస్ట్ చేయించాడు తప్ప ఆమె ఏ పాపం ఎరుగదని కేసీఆర్‌ సర్టిఫై చేశారు. కానీ ఆయన సర్టిఫికేట్‌కి విలువలేదిప్పుడు.

అయితే కూతురు కవిత అరెస్టు గురించి ఎన్నికలలో ప్రచారం చేసుకొని సానుభూతి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్పక చేస్తారనుకుంటే, ఎన్నికల ప్రచారంలో అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. ఎందుకంటే ‘కూతురినే కాపాడుకోలేనివాడు మమ్మల్నేమి కాపాడుతాడు?’ అని బిఆర్ఎస్ నేతలో లేదా కాంగ్రెస్‌, బీజేపీ నేతలో ప్రశ్నిస్తే ఇబ్బంది అవుతుందని మాట్లాడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రజంట్ పోలిటికల్ ఫార్ములా ప్రకారం కవిత కేసు సెటిల్మెంట్ కోర్టులలో కాదు బయట బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య జరగాల్సి ఉంది. జరుగుతోంది కూడా అని సిఎం రేవంత్‌ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఈ ఎన్నికలలో బీజేపీ 5 సీట్లు గెలుచుకునేందుకు కేసీఆర్‌ తోడ్పడితే, లోక్‌సభ ఎన్నికలవగానే ఆమెకు బెయిల్‌ వచ్చేస్తుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుతున్నారు.

ఇది వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు, కల్వకుంట్ల కవిత బెయిల్‌కు ఏదో సంబంధం ఉండే ఉందనిపిస్తోంది. ఇది నిజమో కాదో మే 13న పోలింగ్‌ తర్వాత లేదా జూన్ 4న ఫలితాలు వస్తే గానీ తెలియదు.

ADVERTISEMENT
Latest Stories