ఇచ్చట అన్ని చేదు నిజాలే చెప్పబడును: కవిత

Kalvakuntla Kavitha questions KCR over Kaleshwaram Project and Nizamabad water

భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు.

సరే! తెలంగాణని ఎవరు దోచుకున్నారు? ఆంధ్రా నాయకులు. వాళ్ళని తరిమికొట్టి తెలంగాణ సాధించుకుంటే ఏమవుతుంది? నీళ్ళు, నిధులు, నియామకాలు జరుగుతాయి. జరిగాయా?

ADVERTISEMENT

12 ఏళ్ళ తర్వాత కూడా నీళ్ళ కోసం పేచీలు నడుస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టుల పేరుతో స్కాములు జరిగాయని విచారణలు జరుపుతోంది ప్రభుత్వం.

కేంద్రంనిధులు విడుదల చేయడం లేదని పదేళ్ళు కేసీఆర్‌ ఆరోపిస్తూనే ఉన్నారు. ఎందువల్ల? అంటే కేసీఆర్‌ కయ్యాల వల్లనని కాంగ్రెస్‌, బిజేపిలు చెపుతుంటాయి.

కేసీఆర్‌ హయంలో టిజీపీఎస్సీ నియామకాలు చేపట్టబోతే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పరీక్షలు రద్దయ్యాయి. మరి ఇంతకీ ఏం సాధించినట్లు?

సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ధరణి పోర్టల్ పేరుతో భూకబ్జాలు జరిగాయి. ఎకరం నుంచి వందల ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌హౌసులు ఏర్పాటు చేసుకున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి పదేపదే ఆరోపిస్తుంటారు.

ఆయన కాంగ్రెసోడు.. అలాగే మాట్లాడుతుంటారు. కానీ కల్వకుంట్ల కవిత అలా కాదు… అన్నీ వాస్తవాలే మాట్లాడుతుంటారు.

నిజామాబాద్‌లో పాంచజన్యం సభలో మాట్లాడుతూ, “లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కానీ మన నిజామాబాద్‌ జిల్లాలో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. పదేళ్ళు నేను కూడా ఆ పార్టీలో, ప్రభుత్వంలోనే ఉన్నా. నా ప్రయత్నం నేను చేసినా. కానీ సాధ్యపడలేదు. ఈసారి నాకు అధికారం ఇస్తే నీళ్ళు తెస్తా!”

“నా అత్తారిల్లు భోధన్ జిల్లాలోనే ఉంది. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. కేసీఆర్‌ నేను అధికారంలోకి వస్తే, వంద రోజులలో దానిని తెరిపిస్తానన్నారు. కానీ పదేళ్ళపాటు పాలించినా తెరిపించలేదు. దేనికంటే మా అన్న కేటీఆర్‌ దోస్త్ సంజయ్ కోసం దానిని రిజర్వ్ చేసి పెట్టారట! ఆయన ఆ షుగర్ ఫ్యాక్టరీ కొనాలనుకున్నారట. అందుకే దానిని తెరవకుండా మూతబెట్టి ఉంచేశారు,” నిజామాబాద్‌ భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు.

ఇదివరకు ఆమె బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్‌ రావుతో సహా ఎవరెవరు ఎన్ని ఎకరాలలో ఫామ్‌హౌసులు కట్టుకున్నారో చెప్పారు. కానీ తన ఫామ్‌హౌసు గురించి చెప్పడం మరిచిపోయారు. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి ‘ఆమె జస్ట్ 25 ఎకరాలలో ఫామ్‌హౌసు కట్టుకున్నారని’ గుర్తు చేశారు. వందల ఎకరాలతో పోలిస్తే 25 ఎకరాలలో ఫామ్‌హౌసు అంటే పాపం చాలా అల్ప సంతోషి అనుకోవచ్చు.

సరే ఎవరెవరు ఏం చేశారో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ అవినీతికి పాల్పడినవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా ఎవరిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పైగా వాళ్ళే తెలంగాణకు శ్రీరామరక్ష అట!

ADVERTISEMENT
Latest Stories