కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో, పార్టీ గెలుపుకు కారణమైన పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. ఒకవేళ బొటాబోటి మెజార్టీతో గెలిచి ఉండి ఉంటే బహుశః శివకుమార్ ఇంతగా పట్టుపట్టి ఉండేవారేకారు. కానీ 224కి 135 సీట్ల మెజార్టీతో గెలిచినందున ముఖ్యమంత్రి పదవి చేపడితే ఇక ప్రభుత్వంలో, పార్టీలో తిరుగే ఉండదు. అందుకే ఇద్దరూ పట్టు పట్టారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకుపోయేందుకు ఒప్పించింది. దాంతో పాటు ఆయన కోరుకొన్న కొన్నికీలకమంత్రిపదవులు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. కనుక కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు లైన్ క్లియర్ అయిపోయింది.
గురువారం సాయంత్రం బెంగళూరులోని ఇందిరాగాంధీ భవన్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సమావేశమయ్యి, సిద్దరామయ్యను తమ శాసనసభపక్ష నాయకుడుగా ఎన్నుకొంటారు. ఆ తర్వాత సిద్దరామయ్య, డికె శివకుమార్, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్దతను తెలియజేస్తారు. మే 20న బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బిజెపి ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ శివకుమార్ కనుక కాంగ్రెస్ అధిష్టానానికి లొంగకపోతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి, మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వేచి చూస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు కనుక బిజెపికి ఆ అవకాశం ఇవ్వకుండా శివకుమార్ను బుజ్జగించి ఒప్పించడంతో ఈ కధ సుఖాంతం అయ్యింది.



