టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత ద్వేషిస్తారో అందరికీ తెలుసు. వారివురూ ఆయన పాలన తీరును తప్పు పడుతూ, ఆయన అధికారాన్ని సవాలు చేస్తుండటమే ఆ ద్వేషానికి కారణం. కనుక కుప్పంలో చంద్రబాబు నాయుడుని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి ఇద్దరినీ రాజకీయంగా చావు దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. నోరారా అవ్వా తాత, అక్కా చెల్లీ తల్లీ అంటూ, నీతులు, ధర్మపన్నాలు వల్లిస్తూ ఇంత పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషంతో రగిలిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇంతకాలం వైనాట్ 175? వైనాట్ కుప్పం?వైనాట్ పిఠాపురం? అంటూ చిర్నవ్వులు చిందించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు వైసీపి నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి, చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై ఫిర్యాదు చేశారు.
పోలింగ్ సమయంలో టిడిపి శ్రేణులతో చంద్రబాబు నాయుడు అల్లర్లు, విధ్వంసం సృష్టించారని, సుమారు 60-70 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. కుప్పం, మాచర్ల, మార్కాపురం, బాపట్ల, గంగాధర నెల్లూరు, రాయచోటి, టెక్కలి, జగ్గయ్యపేటతో సహా అనేక నియోజకవర్గాలలో టిడిపి శ్రేణులు హింసకు పాల్పడి ఓటర్లను పోలింగ్ బూత్లకు రాకుండా అడ్డుకుని రిగ్గింగ్కు పాల్పడ్డాయని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. కనుక 60-70 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కుప్పంలో రీపోలింగ్ చేయాలని కోరుతున్న వైసీపి నేతలు తమ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాచర్లలో పోలింగ్ బూత్లో అందరి ఎదుటే ఈవీఎంని ధ్వంసం చేస్తే, అక్కడ రీపోలింగ్ జరపాలని అడగడం లేదు. పైగా అది నకిలీ వీడియో అని బుకాయిస్తున్నారు కూడా.
అయితే కాసు మహేష్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా ఈ నియోజకవర్గాలన్నిటిలో వైసీపి ఓడిపోబోతోందని స్పష్టం అవుతోందని అనుకోవచ్చు.
ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడుని అవలీలగా ఓడించగలమని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలువబోతున్నారని గ్రహించగానే ‘రిగ్గింగ్ జరిగింది… రీపోలింగ్ జరపాలని’ డిమాండ్ చేస్తుండటం ఓటమిని ముందే ప్రకటించుకోవడంగానే భావించవచ్చు. జూన్ 4న ఫలితాలు వెలువడేలోగా వైసీపి నేతలు ఇంకెన్ని కధలు చెపుతారో?
కుప్పం తో సహా 15 నియోజకవర్గాలలో రీ-పోలింగ్ కావాలట
5 ఏళ్లుగా కుప్పం గురించి చాలా మాట్లాడి ఇప్పుడు ఈ వీక్ మాటలేంటి?
రీ-పోలింగ్ లిస్టు కూడా రోజురోజుకు పెరుగుతుంది #YSRCP pic.twitter.com/GytXr7QYSr
— M9 NEWS (@M9News_) May 23, 2024






