ఓడిపోతే ఈడీ వస్తుంది..గెలిస్తే మోడీ వస్తాడు అనేలా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో కేంద్రవర్గాల పని తీరు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేత కవిత మీద కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే చేసిన ఈడీ అధికారులు అధికారం కోల్పోయిన వెంటనే మాత్రం కేసులు అరెస్టులు అంటూ దూసుకుపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అధికారంలో ఉన్నంత కాలం బిఆర్ఎస్ కు అనధికార మిత్రులుగా ఉంటూ వచ్చిన బీజేపీ, కేసీఆర్ కు పదవి పోగానే మాత్రం మిషన్ ఆకర్ష అంటూ బిఆర్ఎస్ నాయకులను ఒక్కొక్కరిగా కమలం గూటికి రప్పించుకుంటున్నారు. గెలిచినప్పుడు కేసీఆర్ వెనుక మోడీ ఉన్నాడు ఓడిపోగానే కవిత ఇంటికి ఈడీ వెల్లింది. ఇది యాదృచ్ఛికమో, రాజకీయ పర్యవసానాలో కానీ వాస్తవానికి మాత్రం చాల దగ్గరగా ఉందనే చెప్పాలి.
అలాగే ఏపీ రాజకీయాల విషయానికి వస్తే…,ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల మీద కూడా కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్న కేసులు ఉన్నాయి. అయితే వాటి విచారణ మాత్రం నత్త నడక కన్నా సున్నితంగా, నిదానంగా వెళుతుంది అనుకోవచ్చు. సాక్ష్యాత్తు జగన్ అక్రమ కేసుల విచారణ, అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కోడికత్తి కేసు, జగన్ బాబాయ్ వివేకా హత్య ఇలా ఎన్నో విచారణకు నోచుకోని కేసులు ఎన్నో ఏపీ ప్రజల కళ్ళ ముందు తిరుగుతున్నాయి.
అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి తో విచారణ ఏపీ సరిహద్దు దాటి ఒక్క అడుగు ముందుకు పడలేదు అంటేనే అధికార పార్టీ నేతలు కేసులని ఏ స్థాయిలో ప్రలోభపెడుతున్నారో అర్ధమవుతుంది. అలాగే గత ఎన్నికలలో జరిగిన మాజీ ఎంపీ హత్యకు సంబంధించి ఆరోపణల్ని ఒక వ్యక్తి వైపే చూపిస్తున్నా, కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు మీడియా సాక్షిగా విస్తరిస్తున్నా అవినాష్ బెయిలు రద్దుకాలేదు, విచారణ ముందుకు సాగలేదు.
హత్య జరిగి 5 ఏళ్ళు అవుతున్న బాధిత కుటుంబానికి అర్ద రూపాయి న్యాయం కూడా జరగలేదు అంటూ వివేకా కుటుంబసభ్యులు గగ్గోలు పెడుతున్న నిందితుడు కడప దాటి అడుగు ముందుకు వేయడం లేదు. అలాగే ఇదే లిక్కర్ స్కాములో కవితతో పాటుగా ఆరోపణలు ఎదుర్కున్న విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రా రెడ్డి విషయంలో కూడా ఈడీ వెనకడుగే వేస్తూ వస్తుంది. దీనికి కారణం కూడా ఏపీలో జగన్ అధికారంలో ఉండడమే కావచ్చు. ఒకవేళ 2024 లో జరిగే ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోతే అప్పుడు జగన్ బ్యాచ్ కు కూడా కవితకు పట్టిన గతే పడుతుందేమో చూడాలి.
ఇలా రాష్ట్రాలలో అధికార మార్పిడి జరిగి…ఉన్న అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీల నేతల కేసులు ముందుకు సాగడానికి, నిందితులని కలవడానికి కచ్చితంగా కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయనేది కవిత విషయంలో రుజుకావడంతో సునీత తన తండ్రి హత్యకు చేస్తున్న న్యాయపోరాటానికి న్యాయం జరిగి ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి నోట నిజం బయటకు రావాలన్నా, కోడికత్తి గుట్టు విప్పాలన్నా, జగన్ అక్రమ ఆస్తుల కేసులలో పురోగతి సాధించాలన్నా, లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న శరత్ చంద్రా రెడ్డి విచారణకు వెళ్లాలన్నా ముందు రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవాల్సిందేనా..!




