తెలంగాణ సిఎం కేసీఆర్, రోజుకి మూడు నియోజకవర్గాలలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శనివారం సిద్ధిపేటలో ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలంటుంది. బీజేపీ మోటర్లకు మీటర్లు బిగిస్తామంటుంది. కానీ మేము రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. కనుక పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నాను,” అని అన్నారు.
ఇప్పుడు ఓ సారి చరిత్ర తిరగేయక తప్పదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక అవసరాలన్నిటినీ తీర్చగల అక్షయపాత్ర వంటి హైదరాబాద్ కేసీఆర్కు లభించింది. దాంతో ఆయన తెలంగాణను అభివృద్ధి చేసుకొన్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలుసు.
అటువంటి గడ్డు పరిస్థితులలో రాష్ట్రాన్ని నడిపించడమే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు చాలా సమర్ధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాకుండా అమరావతి నిర్మాణానికి కూడా పూనుకొన్నారు. పోలవరం పనులను పరుగులు పెట్టించారు. హూద్ హూద్ తుఫాను కూడా ఆయన సామర్ధ్యానికి పరీక్ష పెట్టింది. దానినీ ఆయన అధిగమించి ముందుకే సాగారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఒక్కో సమస్యని పరిష్కరించుకొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించారు.
ఆనాడు చంద్రబాబు నాయుడు అంత నిబ్బరంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వలననే ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా కోల్కొని ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలదనే నమ్మకం ఏర్పడ్డాయి. బహుశః ఇదే తెలంగాణ సిఎం కేసీఆర్ని ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అమరావతిని నిర్మిస్తే, తెలంగాణకు రావలసిన పరిశ్రమలు అమరావతికి తరలిపోతాయి. ఏపీ, తెలంగాణలు రెండుగా విడిపోయినప్పటికీ, వాటి మద్య రాజకీయ బంధాలను కేసీఆర్ విడగొట్టలేకపోతున్నారు.
కనుక ఏపీ అభివృద్ధి చెందితే ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై, తన పార్టీ అస్తిత్వంపై పడుతుందని కేసీఆర్ భావించి ఉండవచ్చు. అందుకే అమరావతిని వద్దనుకొంటున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విదాలా తోడ్పడ్డారనుకోవచ్చు.
అప్పుడు చంద్రబాబు నాయుడు ‘పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకోవద్దని’ ప్రజలను పదేపదే వేడుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడినపడి అభివృద్ధి పదం వైపు సాగుతోందని, కనుక ఒక్క ఛాన్స్ ఇమ్మనమని అడుగుతూ నవరత్నాలు విసురుతున్న వైసీపి మాయమాటలు నమ్మి రాష్ట్రాన్ని నష్టపరుచుకోవద్దని వేడుకొన్నారు.
ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీల నుంచి తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏవిదంగా ఆరాటపడుతున్నారో, ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ ప్రజలు పాలిచ్చే ఆవుని వద్దనుకొన్నారు. తాపీగా బాధపడుతున్నారు. అది వేరే విషయం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలని ఇంతగా ఆరాటపడుతున్న కేసీఆర్, ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలనే ఇప్పుడు ఆయన కూడా చెపుతున్నారు కదా?ఆనాడు ఏపీకి అన్యాయం చేయడాన్ని కేసీఆర్ ఏవిదంగా సమర్ధించుకోగలరు?




