దళితబంధుపై కేసీఆర్‌ నోరు జారారుగా… ఇప్పుడెలా?

KCR జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ తమ రాష్ట్రంలో దళితుల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పధకం గురించి చాలా గొప్పగా చెప్పుకొంటారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో దళితులందరికీ ఈ పధకం అమలుచేస్తామని గొప్పగా చెప్పుకొంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలపై కేసీఆర్‌ చిందులు వేశారు. దళిత బంధు పధకంలో కమీషన్లు నొక్కేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే తోకలు కత్తిరించేస్తానంటూ హెచ్చరించారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

దళిత బంధు పధకంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు తిరిగి చెల్లించనవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తుంది. దాంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, వృత్తి ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు డబ్బు పంచిపెట్టాలంటే ఎంతవుతుందో లెక్క కట్టేందుకు కాలిక్యులేటర్లు సరిపోవు. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ అంత భారం తలకెత్తుకొంటే, ఆ సొమ్ము దళితులకు బదులు బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల జేబులలోకే వెళ్ళిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్‌ స్వయంగా అదే చెప్పడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని స్వయంగా ధృవీకరించిన్నట్లయింది.

ADVERTISEMENT

దీంతో వైఎస్ షర్మిలతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దళిత బంధుని ఎమ్మెల్యేలు వారి అనుకఃరులు నొక్కేస్తున్నారని కేసీఆర్‌ స్వయంగా గుర్తించినప్పుడు వారిపై చర్యలు తీసుకోకుండా హెచ్చరికలతో సరిపెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. దళితుల నోటి కాడ కూడు లాగేసుకొంటున్న ఆ ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేసి తక్షణం వారిని పార్టీలో నుంచి బహిష్కరించి కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే తామే కోర్టును ఆశ్రయించవలసివస్తుందని హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్‌ నోరు జారి ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయారని అర్దమవుతూనే ఉంది. కనుక ఆయన మాటలను మీడియా వక్రీకరించిందని బిఆర్ఎస్ సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎన్నికలలో పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం తలకుమించిన ఇటువంటి పధకాలను ప్రారంభించడం, వాటి గురించి జాతీయ రాజకీయాలలో గొప్పగా చెప్పుకోవడం రెండూ అనర్ధమే అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

కానీ కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల మందికి ఈ పధకాన్ని వర్తింపజేస్తానని కేసీఆర్‌ చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే దళితబంధులో అక్రమాలను అరికట్టలేకపోతే ఇక జాతీయస్థాయిలో ఎలా అరికట్టగలరు? తెలంగాణ రాష్ట్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ పధకాన్ని జాతీయ స్థాయిలో అమలుచేస్తే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతాయో ఊహించుకోవచ్చు.

తెలంగాణ రాజకీయాలలోనే కాక జాతీయ రాజకీయాలలో కూడా దళిత బంధుని కేసీఆర్‌ ‘గేమ్ ఛేంజర్’ అని భావిస్తున్నారు. కానీ దీనిలో ఈవిదంగా అక్రమాలు జరుగుతుంటే నిజంగా ఇదే ‘గేమ్ ఛేంజర్’గా మారి బిఆర్ఎస్ కొంపముంచే ప్రమాదం పొంచి ఉంటుందిగా?

ADVERTISEMENT
Latest Stories