‘అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి తిరగ వ్రాసుకోవలసిందే’ అని కేసీఆర్ ఇదివరకు ఓసారి చెప్పారు. కనుక రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తామని బెదిరిస్తున్నారనుకోవచ్చు.
తెలంగాణలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికిని కూడా సహించలేకపోతున్న కేసీఆర్, గత ఎన్నికలలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో వేలు పెట్టి, అమరావతి నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడుని ఓడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డికి అన్ని విదాలా సహాయసహకారాలు అందించారు. ఆ తర్వాత ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు సిద్దం అయ్యారు కూడా.
ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఉంటే, నేడు ఆంధ్రాలో జగన్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుండేవారేమో? కానీ అధికారం కోల్పోవడం, లోక్సభ ఎన్నికలలో పార్టీని గెలిపించుకోకపోతే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడటంతో జగన్కు మద్దతుగా ఆంధ్రకు రాలేకపోయారని చెప్పవచ్చు.
కానీ తమ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడుని గత ఎన్నికలలో ఓడించి, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించేసి, తెలంగాణ అభివృద్ధికి, రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నందున, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమను కేసీఆర్కు అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. వాటిని ఆయన దాచుకోలేకపోతున్నారు.
ఈసారి ఎన్నికలలో జగన్కు పరోక్షంగా కూడా తోడ్పడలేని పరిస్థితిలో ఉన్నందున టీవీ ఇంటర్వ్యూలో ‘మళ్ళీ జగన్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారని’ కేసీఆర్ జోస్యం చెప్పారు. సాక్షి మీడియా కూడా ఆయనను ఇంటర్వ్యూ చేసి, తమకు కావలసిన రెండు ముక్కలు ఆయన చేత చెప్పించుకొని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటోంది.
”నాకున్న సమాచారం ప్రకారం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని’ కేసీఆర్ తన మనసులో కోరికను ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అన్నట్లు చెప్పారు. ఇది ఏపీ ఓటర్లను, ముఖ్యంగా తెలంగాణలో స్థిరపడ్డవారిని ప్రభావితం చేయడం కోసమే అని అర్దమవుతోంది.
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ సెల్ఫ్ గోల్ చేసుకున్న వైసీపి, దానిని సమర్ధించుకునేందుకు కూడా కేసీఆర్ మాట సాయం తీసుకోవడం విశేషం.
“రైతులకు మేలు చేయాలనే సదుద్దేశ్యంతోనే తెలంగాణలో ధరణి పోర్టల్, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టామని” కేసీఆర్ చెప్పారు. అని అనేకంటే ఆయన చేత అలా చెప్పించుకుందని భావించవచ్చు.
కేసీఆర్, జగన్ ఇద్దరికీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, ఎన్నికల ప్రక్రియపై ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. కలుస్తుంటాయి.
ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణల మద్య విభేధాలు పరిష్కరించుకోలేదు. పరిష్కరించుకుంటే అవసరమైనప్పుడు వాటితో ‘సెంటిమెంట్స్’ రాజేసుకోలేమని అలాగే విడిచి పెట్టేసి ఉండవచ్చు. ఆ పేరుతో కత్తులు దూసుకుంటున్నట్లు నటిస్తున్నా, అవసరం పడినప్పుడు ఇలా ఒకరికొకరు సాయపడుతుంటారు. సహకరించుకుంటారు.
అంటే ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలు, పార్టీల రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు అనుకోవాలేమో?
జగన్పై కేసీఆర్కు దాచుకోలేనంత ప్రేమ ఉందని అర్దమైంది. కనుక కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉందో జగన్ కూడా నిరూపించుకోవలసి ఉంటుంది. గెలిస్తే తప్పకుండా నిరూపించుకుంటారు.






