తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు కాసేపటి క్రితం సికింద్రాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ తరువాత మాట్లాడుతూ కేసీఆర్ సెట్లర్లకు ప్రత్యేక విన్నపం చేసారు. “ఆంధ్ర నుండి సోదరులంతా ఇప్పటికైనా తమని తాము వేరు అనుకోవడం మానెయ్యాలి. అందరూ ఇక నుండి గర్వంగా మేము హైదరాబాదీలమని చెప్పుకోండి. హైదరాబాద్ అంటే ప్రపంచమంతటికీ తెలిసిన బ్రాండ్. హైదరాబాదీలమని చెప్పుకోండి,” అని ప్రకటించారు కేసీఆర్.
[m9ad]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం షెట్లర్లను మోసం చేస్తున్నారని, ఆయన మాయలో పడొద్దని చెప్పుకొచ్చారు కేసీఆర్. “చంద్రబాబు నాయుడుకు ఇక్కడ ఏం పని? రాజకీయం చేసుకోవడానికి ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు లేవా? చంద్రబాబు నాయుడు బుట్టలో పడకుండా తెరాసకు ఓటు వేసి గెలిపించాలి,” అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో లగడపాటి సర్వే గురించి కేసీఆర్ ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తుంది.
“ప్రజలను తప్పుదోవ పట్టించుకోవడానికి కొన్ని వెకిలి మకిలి సర్వేని రేపో ఎల్లుండో ఒక మీడియా ఛానెల్ లో విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. దయచేసి ప్రజలు వాటిని నమ్మొద్దు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలను తిరుగుతున్నా కాబట్టి గట్టిగా చెబుతున్నా తెరాస 100కు పై చిలుకు స్థానాలలో గెలవబోతుంది. ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు,” అని ఆయన ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో లగడపాటి కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరు. ఒక వేళ ఆయన సర్వే బయటకు వచ్చి అందులో వ్యతిరేక ఫలితాలు వస్తే ప్రజలు ప్రభావితం అయిపోతారని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. నిజంగానే తెరాస ఎదురీదుతోందా? లగడపాటి సర్వే తెరాసకు వ్యతిరేకంగా వచ్చిందని కేసీఆర్ కు సమాచారం ఉందా?



