ఇటీవల ఖమ్మం వేదికగా పూరీ – బాలయ్యల “పైసా వసూల్” సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వర్షం వచ్చినప్పటికీ విశేష స్థాయిలో పాల్గొన్న అభిమానులు, చివరికి అదే వర్షం వలన ‘పైసా వసూల్’ అనక తప్పలేదు. ఈ సినిమా ఆడియో వేడుక ప్రారంభమైనప్పటి నుండి వర్షం కురుస్తున్నప్పటికీ ఓపికగా అయ్యేటంత వరకు వేచిచూసిన అభిమానగణం, చివరికి వాన బాగా పెద్దది కావడంతో, కార్యక్రమం ముగిసిన వెంటనే కుర్చీలను తలపై పెట్టుకుని అభిమానులు తరలివెళ్ళడం విశేషం.
ఒక్కొక్కరు ఒక్కో కుర్చీని తడవకుండా తలపై పెట్టుకుని వెళ్తున్న వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిమిత సంఖ్యలో ఇలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నారో ఏమో గానీ, దాదాపుగా ప్రతి ఒక్కరి నెత్తిపై ఒకటి లేక రెండు కుర్చీలు ఉండడంతో, ఆడియో వేడుకకు వచ్చినందుకు తల ఒక్కింటికి ఓ కుర్చీ రూపంలో “పైసా వసూల్” బాగానే వర్కౌట్ అయ్యింది అంటున్నారు నెటిజన్లు. భారీ వర్షం వచ్చినప్పటికీ తమ కోసం నిరీక్షించిన అభిమానులు ఇలా కుర్చీలను పట్టుకువెళ్తున్నా నిర్వాహకులు అడ్డుకోకపోవడం చెప్పుకోదగ్గ విషయమే.
గత కొన్ని రోజులుగా బాలయ్య ఓ అభిమానిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో ఈ వీడియో సందడి చేస్తోంది. దాదాపుగా కొన్ని వందల కుర్చీలు అలా తరలిపోతున్నా… ఏ ఒక్కరూ అడ్డు చెప్పకపోవడంపై బాలయ్య అభిమానులు తమ హీరో గురించి గొప్పగా చెప్పుకుంటుండగా, ఏది ఏమైనా ఆడియన్స్ కు మాత్రం ‘పైసా వసూల్’ టైటిల్ ను సీరియస్ గా తీసుకున్నట్లుగా కనపడుతోందని సెటైర్లు పడుతున్నాయి.
#PaisaVasool ante serious ga teesukunnaru Khammam public..
Ppl Escaped with chairs from audio function 😂😂😂😂 pic.twitter.com/rrMMVjisIK
— 23 (@saisanath_sunny) August 18, 2017


