ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఖచ్చితంగా విజయం సాధించాల్సిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఢిల్లీపై అనూహ్య విజయం సాధించి ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికే టోర్నీ నుండి ధోని టీం పూణే వైదొలగా, అదే బాటలో పయనిస్తుంది అనుకున్న పంజాబ్ జట్టు పుంజుకుని పాయింట్ల పట్టికలో 3వ విజయాన్ని నమోదు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగుల భారీ స్కోర్ ను సాధించి, ఢిల్లీకి గట్టి సవాల్ విసిరింది. స్టోనిస్, సాహాలు చెరో 52 పరుగులతో సత్తా చాటగా, చివర్లో అక్షర పటేల్, మిల్లర్ లు తళుక్కుమనడంతో భారీ స్కోర్ నమోదైంది. అయితే లక్ష్య చేధనలో అదరగొట్టిన ఓపెనర్లు డీకాక్ 52, సామ్సన్ 49 పరుగులు చేసి మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శించారు.
కానీ, ఎప్పుడైతే డీకాక్ ఔటయ్యాడో, అక్కడ నుండి ఢిల్లీ స్కోర్ బోర్డు వేగం మందగించింది. 14వ ఓవర్లో మరో ఓపెనర్ సామ్సన్ కూడా అవుట్ అయిన తర్వాత మ్యాచ్ ను పంజాబ్ తన వైపుకు తిప్పుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సక్సెస్ అయిన పంజాబ్ జట్టు, 172 స్కోర్ వరకే నియత్రించగలిగింది. దీంతో 9 పరుగుల తేడాతో పంజాబ్ విజయం అందుకుంది.



