బీజేపీ-జనసేనల బంధం ఎటువంటిదో చెప్పడానికి సరైన నిర్వచనం లేదు. ఏపీలో పొత్తులోనే ఉన్నా కలిసి పనిచేయవు. కానీ తెలంగాణ ఎన్నికలలో హడావుడిగా పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేశాయి. అయితే బీజేపీతో పొత్తుల వలన జనసేన నవ్వులపాలు కాగా, జనసేనతో పొత్తుల వలన బీజేపీ లాభపడింది.
గత తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా 119 స్థానాలకు పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలుచుకోగా, ఈసారి పవన్ కళ్యాణ్ ప్రచారం కారణంగా మరో ఏడు సీట్లు అదనంగా గెలుచుకొంది. కనుక లోక్సభ ఎన్నికలలో కూడా జనసేనతో బీజేపీ దోస్తీ కొనసాగిస్తుందనుకొంటే, ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి ‘నోనోనో…’ అని అనేశారు.
శుక్రవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలలో మన బలం పెరిగింది. ఇదే ఊపుతో లోక్సభ ఎన్నికలలో కూడా మన సత్తా చూపాలి. లోక్సభ ఎన్నికలలో మనం ఎవరితోను పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే పోటీ చేసి 17 సీట్లు గెలుచుకొనేందుకు గట్టిగా కృషి చేద్దాం,” అని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో కేవలం 17 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నందునే వాటిని జనసేనతో పంచుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదని చెప్పవచ్చు. శాసనసభ ఎన్నికలలోనే డిపాజిట్లు కోల్పోయిన జనసేన, లోక్సభ ఎన్నికలలో గెలుస్తుందనే నమ్మకం లేదు.
ఇదీగాక లోక్సభ ఎన్నికలలో ప్రాంతీయ సమస్యలు, స్థానిక అంశాల కంటే జాతీయ అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. కనుక కేంద్రంలో మళ్ళీ మోడీ పాలన కావాలా వద్దా? అనే కోణంలోనే ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తారు. కనుక పవన్ కళ్యాణ్ అవసరం లేదని బీజేపీ అనుకోవడం సహజమే.
శాసనసభ ఎన్నికలలో ఎదురైన పరాభవం తర్వాత, పవన్ కళ్యాణ్ లోక్సభ ఎన్నికల గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ పోటీ చేద్దామనుకొన్నా బలమైన అభ్యర్ధులు ఎవరూ లేరు. దొరకకపోవచ్చు. కనుక కిషన్ రెడ్డి నిర్ణయం పవన్ కళ్యాణ్ఎకు చాలా ఉపశమనం కలిగించేదే అని చెప్పవచ్చు.
కానీ అదే సమయంలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతాయి. మరి వాటిలో జనసేనతో… దాంతో బాటు టిడిపితో పొత్తులకి బీజేపీ సిద్దమవుతుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.
బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకొంటోంది తప్ప ఆయన మాటకు విలువిచ్చిన దాఖలాలు లేవు. కనుక ఏపీలో బీజేపీకి దూరంగా ఉండటమే మంచిదేమో?




