‘రాష్ట్రంలో 97% ప్రజలకు మేలు చేశాము కనుక 175 సీట్లు మావే’ అని వైసీపి నేతలు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, వారి మాటలు, చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి.
టిడిపి, జనసేనలు పొత్తులు గురించి టెన్షన్. తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి గురించి టెన్షన్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడి శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో వైసీపికి మళ్ళీ కొత్త టెన్షన్ మొదలైంది.
దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ఆత్మసాక్షి తమ కోణంలో నుంచి కధలు చెప్పడం మొదలుపెట్టేశారు. “కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటైన టిడిపి ఇప్పుడు అదే కాంగ్రెస్తో చేతులు కలిపిందని, రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని, అక్కడి రాజకీయాల గురించే ఆలోచిస్తారు తప్ప ఏపీలో చంద్రబాబు నాయుడుని గెలిపించడానికి బయలుదేరివచ్చేస్తారా?” అంటూ వైసీపి నేతలు తమ భయాలను, ఆందోళనను బయటపెట్టుకొంటున్నారు.
గత ఎన్నికలలో టిడిపిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని సిఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు కేసీఆర్ సహాయ సహకారాలు అందించినప్పుడు వైసీపికి తప్పనిపించలేదు! కానీ తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోయినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దానికి చంద్రబాబు నాయుడినే నిందిస్తున్నారు!
వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని మాటలు వింటే ఇది అర్దమవుతుంది. “లారీ కింద పడుకొన్న కుక్క ఆ లారీని తానే మోస్తున్నానని అనుకొంటుంది. కానీ లారీ కదిలితే దాని కింద అది కుక్క చావు చస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తానే గెలిపించానని, రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానని ఊహించేసుకొంటున్నారు. కానీ చివరికి ఆయనకి కూడా లారీ కింద కుక్క పరిస్థితి అవుతుంది,” అని అన్నారు.
ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోతే కాంగ్రెస్ గెలిచేస్తుందని, గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు వంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎలా అనేసుకొంటారు?ఈసారి ఎన్నికలలో కూడా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని కేసీఆర్ చివరి నిమిషం వరకు గట్టిగా చెపుతూనే ఉన్నారు కదా?
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్లో సీనియర్లు చివరి నిమిషం వరకు పోటీ పడ్డారు కదా?అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వారందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడిన తర్వాతే రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేసింది కదా?మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో చంద్రబాబు ఎలా నిర్ణయించగలరు? నిర్ణయించలేనప్పుడు తానే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశానని ఎందుకు చెప్పుకొంటారు?
రేవంత్ రెడ్డిని సాయం చేయమని చంద్రబాబు అడిగింది లేదు. ఆయన చేస్తానని చెప్పిందీ లేదు. కానీ వైసీపి నేతలు వారి ఆత్మసాక్షే ఇలా ఏవేవో ఊహించేసుకొంటూ తమలో భయాలను, ఆందోళనని బయటపెట్టేసుకొంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారని అర్దమవుతూనే ఉంది. ప్రతీ దానికి ఇంత భయపడుతుంటే మరి 175 సీట్లు ఎలా గెలుచుకొంటారు?




