వైసీపిలో సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి అయితే, విజయసాయి రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్, రోజా వంటివారు పులులని అనుకోవచ్చు.
పోలింగ్కు ముందు యుద్ధానికి సిద్దం అంటూ చొక్కా మడత పెట్టిన సింహం, పోలింగ్ తర్వాత మూడు రోజులు సైలంట్గా ఉండి పోయింది. కానీ పార్టీలో మిగిలిన పులులన్నీ ఆర్తనాధాలు చేస్తుంటే సింగిల్ సింహం బయటకు వచ్చి ఓ సారి ఘర్జించి ధైర్యం చెప్పి, విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోతోంది.
మరోపక్క కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒకరొకరిని ఏరి పారేస్తోంది. ఈ పరిస్థితిలో ఘర్జించడం మంచిది కాదనుకున్నారో ఏమో విజయసాయి రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్, రోజా వంటివారి ఘర్జనలు ఇప్పుడు వినపడటం లేదు. ఘర్జనలకు బదులు వారి ఆక్రందనలే వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే విజయసాయి రెడ్డి పోలింగ్ తర్వాత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు.
ఎన్నికల ప్రచార సమయంలో ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టిడిపి, జనసేనల పని అయిపోయిందన్నట్లు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో… ఏం చేస్తున్నారో?
కొడాలి నాని బూతులు విని చాలా రోజులే అయిపోయిందే అని జనాలే అనుకుంటున్నారు. అలాగని ఆయన కనపడకుండా పోవడానికి గుడివాడ ఏమీ పెద్ద నగరం కాదు. అంత చిన్న పట్టణంలో ఆయన ఎక్కడున్నారో అని వైసీపి కార్యకర్తలే వెతుక్కోవలసి వస్తోంది.
ఎన్నికలకు ముందే ఫలితాలను ఊహించిన వైసీపి నేతల్లో వల్లభనేని వంశీ కూడా ఒకరు. అందుకే నారా లోకేష్గారు, చంద్రబాబు నాయుడుగారు అంటూ టిడిపిలో అందరికీ ‘గార్లు’ వడ్డించారు కానీ తాను తినబోయే గారెలు చాలా చేదుగా ఉండబోతున్నాయని తెలుసుకునే ఉంటారు.
ఏది ఏమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇది ప్రళయం ముందు నిశబ్ధంలా చాలా భయంకరంగా కూడా ఉంది. జూన్ 4 తర్వాత పులులు ఎవరో… వాటికి బలయ్యే మేకలు ఎవరో?






