సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా చాలా బలంగా ఉండేది ఎందుకంటే అక్కడ కొండా మురళి, సురేఖ దంపతులవంటి పలువురు బలమైన నాయకులు పార్టీలో ఉండేవారు. కానీ రాష్ట్రం విడిపోవడం ఖాయం అని తెలియగానే తెలంగాణ వైసీపీలో నేతలు, కార్యకర్తలను రోడ్డున పడేసి, సమైక్యాంద్రా అంటూ ఉద్యమాలు చేసి ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి నమ్ముకొన్న కొండా దంపతులవంటివారు అనేకమంది రాజకీయంగా నిరాశ్రయులయ్యారు.
నిరాశ్రయులు అని ఎందుకు అనవలసివచ్చిందంటే వారందరూ జగన్మోహన్ రెడ్డినే నమ్ముకొని తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉండిపోయారు. దాంతో వారందరూ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారు. ఆ కారణంగానే కొండా దంపతులు నేటికీ రాజకీయంగా కోలుకోలేకపోతున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ, తన టీవీ చానల్లో వివిద రంగాలకు చెందిన ప్రముఖులను ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె’ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆదివారం కొండా దంపతులను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారు ఇంతకాలం తాము అనుభవించిన క్షోభను బయటపెట్టారు. తమను నడిరోడ్డున వదిలేసిన తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తమని పలకరించలేదన్నారు. జగన్ వలన తమ రాజకీయ జీవితం నాశనమైందని కానీ ఏనాడూ కనీసం ఫోన్ చేసి ఓదార్చలేదన్నారు. తర్వాత ఓకేసు విషయంలో కోర్టులో విజయమ్మని కలిసినప్పుడు, జగన్ నిర్ణయం వలన తాము ఎంతగా నష్టపోయామో చెప్పి, జగన్ తీరు పట్ల చాలా బాధపడ్డామని చెప్పామన్నారు. కానీ విజయమ్మ కూడా స్పందించలేదన్నారు.
వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ, రాజకీయాల కోసం సొంత బంధువులనే చంపుకోవడం చాలా దారుణమని, హత్య చేసిన తర్వాత సాక్ష్యాధారాలు తుడిచేసి సహజమరణంగా చూపించాలని ప్రయత్నించడం చూసి తాము షాక్ అయ్యామన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఈ హత్యకు పాల్పడిన వైసీపీ నేతలందరినీ లోపల వేసేయాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారని, కానీ అప్పుడు అరెస్ట్ చేసి లోపల వేస్తే జగన్ సానుభూతి ఓట్లు సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారని, కనుక ఎలాగూ మళ్ళీ టిడిపియే గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించాలనుకొన్నారని కొండా దంపతులు చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యుంటే అందరినీ లోపల వేసేవారని కానీ ఆయనే ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో అంతా తారుమారు చేసేశారని కొండా దంపతులు అభిప్రాయపడ్డారు.



