కేసీఆర్ కుటుంబంలో అందరూ మాటలు నేర్చిన చిలకలే. కేసీఆర్ శిక్షణలో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు కూడా బాగా మాటలు నేర్చారు. కనుక నందిని పంది.. పందిని నంది అని నమ్మించగలమనే అనుకుంటారు.
అలా అద్భుతంగా మాట్లాడుతూ జనాలను మెప్పిస్తున్నామనే అనుకుంటారు తప్ప మన మాటలను జనం నమ్ముతున్నారో లేదో తెలుసుకోరు.
సిఎం రేవంత్ రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ నేతలను గడగడలాడిస్తున్నామనే భ్రమలో ఉంటారు తప్ప ఆయనే తమకు మెల్లమెల్లగా ఉచ్చు బిగిస్తున్నారని గ్రహించరు. కేసీఆర్నే గద్దె దించిన రేవంత్ రెడ్డికి తమ కంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని కూడా గ్రహించినట్లు లేదు.
అందుకే ఆయనను ఉద్దేశ్యించి కేటీఆర్ చాలా చులకనగా మాట్లాడుతుంటారు. అయనను తక్కువగా అంచనా వేసి బోర్లాపడుతూనే ఉన్నారు.
నిన్న తమ కుటుంబ ఆస్తుల విషయంలో, నేడు నాంపల్లి కోర్టు వద్ద ఫార్ములా రేసింగ్ కేసు గురించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఇదే భావన కలుగుతుంది.
తమ తాతముత్తాతల కాలం నుంచే తమకు వందల ఎకరాలున్నాయని చెప్పారు. మళ్ళీ అదే నోటితో హైదరాబాద్లో తామందరం కలిసి జీవించేందుకు ఒక ఇల్లు లేదన్నారు.
ఉండేందుకు ఒక ఇల్లు కూడా లేదంటూనే ఎవరికీ వారికి ఇళ్ళు, ఫామ్హౌసులు ఉన్నాయని, వాటిలో తాము వేర్వేరుగా జీవిస్తున్నామని కేటీఆరే చెప్పుకున్నారు. ఈ మాటలపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తే కేటీఆర్ కూడా తట్టుకోలేరు.
ఇక ఫార్ములా-1 రేసింగ్ కేసులో నేడు నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు కూడా కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాననే అనుకున్నారు.
“తమిళనాడు సిఎం విజయ్ రేసింగ్ చూసేందుకు లండన్ వెళ్ళారు. కానీ నేను హైదరాబాద్లోనే రేసింగ్ ఈవెంట్ నిర్వహించాను. కేసీఆర్పై కక్షతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి నాపై ఈ అక్రమ కేసు నమోదు చేయించి కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మాకు లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. కనుక మాకు ఓ వెయ్యి కోట్లు ఇచ్చేసి ఆ లక్ష కోట్లు తీసేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అంటూ వ్యంగ్యంగా అన్నారు. కానీ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టినట్లు లేదు.
సిఎం ఆదేశం మేరకు నిన్నటి నుంచే రెవెన్యూ అధికారులు కేసీఆర్ ఫామ్హౌసు ఉన్న ఇంద్రవెల్లి గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించేందుకు సర్వే జరుపుతున్నారు.
ఒకవేళ వారి సర్వేలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను కేసీఆర్ ఆక్రమించారని తెలిస్తే, ఆయన బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది. దానిపైనే ఆధారపడిన కేటీఆర్ రాజకీయ భవిష్యత్, బీఆర్ఎస్ పార్టీ… దానినే నమ్ముకున్న నేతలు నష్టపోతారు.
అలాగని సర్వేని అడ్డుకుంటే కేసీఆర్ కబ్జాలు చేశారు కనుకనే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. కనుక దీనికి పరిష్కారం ఏమిటంటే, రేవంత్ రెడ్డి.. అయన ఇద్దరు సోదరులు, కుటుంబ సభ్యులకు కూడా వందల ఎకరాలున్నాయంటూ ఎదురుదాడి చేయడమే. ప్రస్తుతం హరీష్ రావు అదే చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తమ జోలికి రాకుండా ఏదో విధంగా అడ్డుకోగల సమర్ధత కేసీఆర్కుంది. కానీ ఒక్కొక్కరూ ఎన్ని వందల ఎకరాలు పోగేసుకున్నారనే విషయం ఇక ఎంత మాత్రం దాచిపెట్టలేరు కదా?
అయినా తమ వాక్చాతుర్యంతో రేవంత్ రెడ్డి పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచగలిగితే చాలు, వారు తమ అవినీతి సంపాదనను పట్టించుకోకుండా గుడ్డిగా మళ్ళీ తమకే ఓట్లు వేసి అధికారం కట్టబెడతారనే గట్టి నమ్మకంతో ఉన్నారు.
తమ ఈ భూముల అంశం కూడా మరో నాలుగైదు రోజులలో ఎలాగూ చల్లారిపోతుంది. అప్పుడు ప్రజలు కూడా మరిచిపోతారని భావిస్తున్నట్లే ఉన్నారు. ప్రజల జ్ఞాపకశక్తిని, విచక్షణను తక్కువగా అంచనా వేయడం వల్లనే తాము ఒకసారి బోర్లాపడ్డామని మాత్రం గ్రహించడం లేదు.
1000 కోట్లకు మొత్తం రాసిస్తా.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా!
1000 ఎకరాలు అన్నావు.. మిగతా 933 ఎకరాలు ఎక్కడ?
నీ అయ్యా ఎత్తుకుపోయిండా?
–@KTRBRS #BRS pic.twitter.com/eMLP7pMaxN
— M9 NEWS (@M9News_) September 18, 2026




