పది సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పుదాము… రెడీయా?

KTR

ఆనాడు కేసీఆర్‌ దేశ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తెచ్చేందుకు ప్రత్యేక విమానం వేసుకొని అన్ని రాష్ట్రాలు తిరిగారు. గత లోక్‌సభ ఎన్నికలలో ‘కారు సారు… ఢిల్లీ సర్కారు’ అంటూ చాలా హడావుడి చేశారు.

“తెలంగాణను ఉద్దరించేశాను… దేశాన్ని ఉద్దరించడానికి నన్ను వెళ్ళమంటారా వద్దా?” అని ప్రజలను అడిగి ‘మమ’ అనిపించుకునేవారు.

ADVERTISEMENT

‘దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని’ పార్టీ నేతలతో, సొంత మీడియాలో ప్రచారం చేయించుకున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ రెంటికీ పూర్తి మెజార్టీ రాధాని కనుక నాకు 16 సీట్లు ఇస్తే ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పుతానని గట్టిగా వాదించి 9 సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

మళ్ళీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. కనుక ఈసారి కేసీఆర్‌కు బదులు ఆయన కుమారుడు కేటీఆర్‌ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే పాత పాట పాడటం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాకు 16 సీట్లు అక్కరలేదు జస్ట్ 10 సీట్లు ఇస్తే చాలు ఢిల్లీలో చక్రం తిప్పేస్తామని చెపుతున్నారు.

దేశంలో అతి తక్కువ ఎంపీ సీట్లు (17) ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. ఆ సీట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీలు ఈసారి గట్టిగా పోటీ పడుతున్నాయి. కనుక ఈసారి బిఆర్ఎస్ పార్టీ 3-4 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే అని సర్వేలు చెపుతున్నాయి.

మరోపక్క కేంద్రంలో మళ్ళీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని కూడా చెపుతున్నాయి. అయినా ముందు జాగ్రత్త కోసం ఎన్డీయేలోకి టిడిపి, జెడియు (బిహార్) వంటి పాత మిత్రులను ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా లోక్‌సభలో బీజేపీ బలం పెంచుకొంటూనే, ఇండియా కూటమిని బలహీన పరుస్తోంది.

‘చాణక్యుడు’ కుమారుడుకి ఈమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదనుకోలేము. కానీ 10 సీట్లతోనే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పుతానంటున్నారు?అంటే బహుశః గ్యారేజీలో ఉండిపోయిన తమ గులాబీ కారుని మెల్లగా బయటకు కదిలించే ప్రయత్నమే ఇదని చెప్పవచ్చు.

ఆనాడు కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టిన్నట్లే ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ 10 ఎంపీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.

అయితే ఒకప్పుడు 17 సీట్లలో ఒకటి మజ్లీస్‌కు పోగా మిగిలిన 16 మావే అన్నట్లు మాట్లాడే కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు 10 సీట్లు ఇస్తే చాలు చక్రం తిప్పుకుంటామని చెప్పడమే బిఆర్ఎస్ పార్టీ వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది కదా? ఇక ఢిల్లీ వరకు ఎందుకు? అయినా కల్వకుంట్ల కవితని ఓదార్చడానికి ఢిల్లీ వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు. కానీ చక్రం తిప్పడం కోసం వెళతామంటే చాలా ప్రమాదం కదా?

ADVERTISEMENT
Latest Stories