విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలు తప్పడంపై వివరణ ఇచ్చారు. తాను సర్వే చేశానని, మానిప్యులేట్ చేయలేదని,మొదటి సారి తన సర్వే ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన అన్నారు. డబ్బు ప్రభావంతో పాటు విపక్షాలు చెబుతున్న ఈవీఎంల మానిప్యులేషన్, ఓటింగు శాతం ప్రకటించకుండా గణనీయంగా పెంచడం, వంటి వాటి గురించి ప్రస్తావించడం గమనార్హం. ఇదే సమయంలో కంప్లీట్ స్వీప్ అవ్వాల్సిన పంచాయతీ ఎన్నికలలో ప్రతిపక్షాలు గణనీయంగా ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు.
తెలంగాణ ఎన్నికల దెబ్బకు సర్వేలు మానేస్తారు అనే దానిని కూడా ఆయన తోసి పుచ్చారు. ఆ విషయం అటుంచితే వచ్చే లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సర్వే ఫలితాలు వెల్లడించనని, ఎన్నికల తర్వాత మాత్రమే ప్రకటిస్తానని లగడపాటి చెప్పుకొచ్చారు. అయితే స్నేహితులు ఎవరు అయినా అడిగితే చెబుతా అని ఆయన అనడం విశేషం. ఇటీవలే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తో కలిసి చంద్రబాబుని కలవడంపై మీడియా ప్రశ్నించగా అది తన పర్సనల్ అని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన సందర్భంగా తాను చెప్పిన మాట బట్టి తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని, ఒకవేళ రాజకీయాలలోకి వస్తే,తెలంగాణ నుంచి పోటీచేస్తానని లగడపాటి చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా అని అడిగితే కాదని చెప్పడం విశేషం. గత కొద్ది కాలంగా లగడపాటి టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయనకు గల సాన్నిహిత్యం వల్ల ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆయన ఇలా క్లారిటీ ఇవ్వడం విశేషం.



