పాకిస్థాన్కి చాలా అన్యాయం జరిగిపోతోంది. ఒకవైపు ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు తమ దేశంపై విరుచుకుపడుతున్నారట. మరోవైపు బలూచిస్థాన్లో వేర్పాటువాదం పెరిగిపోతోందట! మరోవైపు సింధు జలాలు పాక్లోకి పారకుండా భారత్ అడ్డుపడుతూ సింధూ ట్రీటిని తుంగలో తొక్కుతోందట!
ఈ అన్యాయాలను ఎంతమాత్రం సహించేది లేదని చెప్పారు… ఆ దేశ ప్రధాని.. లేదా పార్లమెంట్ కాదు. ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్. ఇస్లామాబాద్లో తన కోర్ కమాండర్లతో సమావేశమై ఈ అంశాలన్నిటి గురించి చర్చించారు.
పాక్కు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ముఖ్యంగా సింధూ జలాలను అడ్డుకోవడాన్ని యుద్ధానికి కవ్వింపు చర్యగానే పరిగణిస్తామన్నారు.
కాశ్మీర్ విషయంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
సాధారణంగా జాతీయ ప్రయోజనాలు, ఇరుగు పొరుగు దేశాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశాలపై భారత్ లేదా మరే ఇతర దేశంలోనైన పాలకులు పార్లమెంటులో చర్చిస్తారు. కానీ పాక్లో సైన్యాధ్యక్షుడు తన కమాండర్లతో చర్చించడం గమనిస్తే పాక్లో అధికారం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు? అనే సందేహం కలగడం సహజం.
ఏది ఏమైనప్పటికీ కాశ్మీర్, బలూచిస్థాన్ విషయంలో పాక్ ద్వంద వైఖరి మున్నీర్ మాటల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
పాక్ ప్రేరిత ఉగ్రవాదులు కశ్మీర్ లేదా భారత్లో వివిధ ప్రాంతాలలో ఉగ్రదాదులు చేసినప్పుడు వాటితో తమకు సంబంధం లేదని చెప్పి పాక్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ బలూచిస్తాన్లో వేర్పాటువాదాన్ని, పాక్పై ఆఫ్ఘనిస్తాన్ దాడులను ఖండిస్తుంటుంది. వాటి వెనుక భారత్ ఉందని ఆరోపిస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా కశ్మీర్ విషయంలో తమ వైఖరి ఏమాత్రం మారలేదని పాక్ స్వయంగా ఐక్యరాజ్యసమితిలో పదేపదే చెప్పుకుంటూనే ఉంది కూడా.
పాక్ ప్రభుత్వంపై సైనిక పెత్తనం, ఉగ్రవాదులను పెంచి పోషించడం, వారిని భారత్పైకి ఉసిగొల్పుతూనే తమ దేశానికి న్యాయం జరగాలని ఆశించడం దురాశే అవుతుంది.
ముఖ్యంగా సింధూ జలాల కోసం అవసరమైతే భారత్తో యుద్ధానికి సిద్దమన్నట్లు ఆసిమ్ మునీర్ మాట్లాడటాన్ని భారత్ ప్రమాద సంకేతంగా భావిస్తే పరిస్థితి ఏమిటి?




