ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. మొదట తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని ఢిల్లీ హైకోర్టుకు విన్నవించుకొని 2 వారాలు మద్యంతర బెయిల్ పొందగా, ఆ ఉత్తర్వులను ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
మొదట భార్యకు బాగోలేదంటూ చెప్పిన ఆయన, తాము స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి చూసి వస్తామని చెప్పగానే నానమ్మకు బాగోలేదని కోర్టుకు చెప్పారన్నారు. మళ్ళీ ఇప్పుడు నాన్నమ్మ కాదు అమ్మమ్మకు బాగోలేదని చెపుతున్నారని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ఏ రాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
మద్యంతర బెయిల్ కోసం నిందితుడు తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని వాదించారు. ఈవిదంగా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేదనే సాకుతో నిందితులు బెయిల్ సంపాదించుకొని వెళ్ళిపోతుంటే కేసు విచారణ ఆలస్యమవుతుందని వాదించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసి ఈనెల 12లోగా కోర్టులో లొంగిపోవలసిందిగా మాగుంట రాఘవరెడ్డిని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూపుగా ఏర్పడి వందకోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ కేసులోనే మాగుంట రాఘవరెడ్డిని ఫిభ్రవరి 10న ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి ఇటీవల అప్రూవరుగా మారిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కనుక ఈ కేసుతో నిందితులుగా ఆరోపించబడుతున్నవారందరూ ఇప్పుడు ఆయన ఎవరెవరి పేర్లు బయటపెడతారో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని, అరెస్ట్ చేయక తప్పదని గత మూడు నెలలుగా వాదిస్తున్న సీబీఐ ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయింది. కనీసం విచారణకు కూడా రప్పించుకోలేకపోతోంది. ఎప్పుడు పిలిచినా ఆయన ఓ కొత్త కధతో సిద్దంగా ఉంటారు. పాపం మాగుంట రాఘవరెడ్డికి ఇవన్నీ తెలీకపోవడంతో అరెస్ట్ అయ్యారు. అతి కష్టం మీద తాత్కాలిక బెయిల్ సంపాదించుకొన్నా దానిని నిలుపుకోలేకపోయారు. పాపం ఆయనకి ఎవరైనా చెపండర్రా!



