ఇటీవలే మొదలయిన మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ నిబంధనలను పాటించకుండా పాత ధరలతో ప్రేక్షకులనుండి టాక్స్ వసూలు చేస్తుండటంతో ‘ఏయంబీ సినిమాస్’కి నోటీసులు అందినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వంద రూపాయల కంటే ఎక్కువ ఉన్న టిక్కెట్ టాక్స్ 28 నుండి 18 శాతానికి తగ్గించారు. 2019 జనవరి 1 నుండి ఈ కొత్త విధానం అమలు చేయాల్సిఉంది.
అయితే ఇటువంటి టిక్కెట్ల మీద 28 శాతం టాక్స్ వసూల్ చేసింది మల్టీప్లెక్స్ యాజమాన్యం. 2017 జీఎస్టీ యాక్ట్ సెక్షన్ 171 కింద రంగారెడ్డి జీఎస్టీ కమీషనరేట్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. తనిఖీలు జరిగిన మాట వాస్తమేనని తాము నిబంధలకు లోబడే టిక్కెట్ టాక్స్ వసూలు చేస్తున్నామని.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ఏయంబీ సినిమాస్ వాదిస్తుంది. దీనితో ఈ వివాదంపై క్లారిటీ రావాల్సిఉంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ భారీ స్క్రీన్తో పాటు.. 4D సౌండ్ సిస్టమ్తో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.
నగరంలోని అత్యంత ఖరీదైన మల్టీప్లెక్స్ ఇదే మరియు ఇక్కడే టిక్కెట్ల ఖరీదు ఎక్కువ కూడా. టాక్స్ సంబంధిత వివాదాలు మహేష్ బాబు కు కొత్తేమీ కాదు. ఈ మధ్యనే ఆయన చేస్తున్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల పై సర్వీసు టాక్స్ ఎగ్గొట్టారు అనే ఆరోపణలపై నోటీసులు అందుకున్నారు. మొదట్లో న్యాయ పోరాటం అన్నా తరువాత తప్పు ఒప్పుకుని అపరాధ రుసుము చెల్లించేశారు మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం మహర్షి షూటింగులో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.



