‘అభిమానం’ ముసుగులో పవన్ కళ్యాణ్ అభిమానులు హద్దులు దాటుతున్నారా? కనీస అవగాహన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు మహేష్ కత్తి. తాను ఇచ్చిన రెండు గంటల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కేవలం మూడు నిముషాల వీడియోను చూసి, వెర్రి వేషాలు, ఉన్మాద చేష్టలు చేయడం వలనే తాను ఇలా మీడియా ఛానల్ లో కూర్చునే పరిస్థితికి వచ్చానని ఆవేదన చెందుతూ మాట్లాడారు.
తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి, వైఎస్ జగన్ గురించి, నరేంద్ర మోడీ గురించి కూడా మాట్లాడానని, అవేమీ చూడని మీరు నాపై అడ్డంగా మాట్లాడుతున్నారని, మీకు ఎంత చెప్పినా వృధా అంటూ పవన్ ఫ్యాన్స్ తీరును ఏకరువు పెట్టారు. సినీ ఇండస్ట్రీలో మీరు ఏమైనా నియంతలా ఏంటి? నా వృత్తి పరంగా నేను అందరి గురించి మాట్లాడతా… ఎందుకు..? అనే అధికారం మీకు లేదంటూ సూటిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చెప్పారు.
సదరు మీడియా ఛానల్ ఏర్పాటు చేసిన పవన్ అభిమానుల ఫోన్ కాల్స్ ను చూసి వారిపై జాలిపడడం వీక్షకుల వంతయ్యింది. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై మహేష్ కత్తి వేసిన ప్రశ్నలలో తప్పు లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు చాలా సహజం. వాస్తవానికి మహేష్ కత్తి వేసిన ప్రశ్నలు కూడా పవన్ కళ్యాణ్ హితవు కోరేవే. అయితే వాటిని అర్ధం చేసుకోవడంలో తమ ప్రతిభ ఏమిటో పవన్ అభిమానులు మరోసారి నిరూపించుకున్నట్లయ్యింది.
పవన్ ను ఎవరు ఏమీ ప్రశ్నించకూడదు అనుకుంటే మహేష్ కత్తి అన్నట్లు తమ అభిమాన హీరోను రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పాల్సిందే. తాము నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నామని అదే అభిమానాన్ని పక్కన వాడిపై రుద్దాలని చూడడం బహుశా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే సాధ్యమవుతుందనిపించే విధంగా మహేష్ కత్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అభిమానులు చేసిన ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని తనకు సంజాయిషీ ఇవ్వాలని కోరడంలో కూడా అర్ధముంది.
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలున్నారు… అలాగే ఇంకెంతో మంది అభిమానులున్నారు… కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ అభిమానులే ఎందుకు హంగామా చేస్తున్నారు? అన్న ప్రశ్న ఉత్పన్నమైతే జవాబు వారికే లభ్యం అవుతుంది. ఆవేశంలో విజ్ఞత కోల్పోయి మాట్లాడడం అనేది ఎవరికైనా పొరపాటుగా జరిగే విషయం. కానీ పవన్ అభిమానులకు మాత్రం ఇది అలవాటుగా మారుతోంది. ఇక ఈ ఉదంతంలో రాంగోపాల్ వర్మ వేలుపెడితే ఉంటుంది అసలు రచ్చ..!


