ఇంచార్జ్ ల మార్పుతో విసిగి పోతున్న వైసీపీ నేతలు తమ అసహనాన్ని, అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా చిలకలూరి పేట ఇంచార్జ్ బాధ్యతల నుండి మంత్రిగా ఉన్న విడుదల రజనీని తప్పించి ఆమెను గుంటూరు పచ్చిమంకు మార్చారు ముఖ్యమంత్రి జగన్.
ఈ నేపథ్యంలో చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు ని పార్టీ సమన్వయ కర్తగా ప్రకటించింది వైసీపీ. అయితే సమన్వయ కర్తగా పార్టీ కోసం పని చేస్తున్న మల్లెల రాజేష్ ను కూడా ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించేందుకు పార్టీ అధిష్టానం సిద్దమైనట్లు సమాచారం అందుకున్న మల్లెల రాజేష్ చిలకలూరిపేట మాజీ ఇంచార్జ్ ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని పై తీవ్ర ఆరోపణలు చేసారు.
తన నాయకత్వ మార్పు పై వచ్చే వార్తల పై పార్టీ కార్యకర్తలతో, తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసిన మల్లెల రాజేష్ మంత్రి విడుదల రజని తన వద్ద నుండి 6 .5 కోట్లు వసూళ్లు చేసారంటూ ఆరోపించారు. ఈ విషయమై సజ్జల దగ్గర పంచాయితీ జరిగిందని..దానిలో భాగంగా రజని నుంచి 3 కోట్లు వెనక్కి వచ్చాయని ఆ మిగిలిన మొత్తాన్ని రజని ఎందుకు వెనక్కి ఇవ్వడం లేదంటూ సొంత పార్టీ నేత పైనే ఆరోపణలు గుప్పించారు మల్లెల రాజేష్.
రజనికి దమ్ముంటే చిలకలూరి పేట నుంచి పోటీ చేసి గెలవాలంటూ సవాల్ కూడా విసిరారు రాజేష్. తనను కాదని పార్టీ మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇచ్చిన పని చేయడానికి, 20 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించిన రాజేష్ తనకు, మర్రి రాజశేఖర్ కు కాకుండా ఎవరో బయట వారికీ టికెట్ ఇస్తే మాత్రం సహించబోను అంటూ పార్టీ అధిష్టానానికి అల్టిమేటటం జారీ చేసారు.
జగన్ సిద్ధం…సిద్ధం అంటూ ప్రతిపక్షాల మీద విమర్శలకు సిద్దపడుతుంటే…ఇలా సొంత పార్టీ నేతల మీదే రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయడానికి మరికొంతమంది వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. మొన్న మరో మహిళా మంత్రి నగరి ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి ఆరోపణలే చేసారు ఆ పార్టీ నాయకులు. ఆమె, ఆమె భర్త, ఆమె సోదరులు కలిసి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లు కొనసాగిస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారని ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహకరించబోమంటూ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు స్థానిక వైసీపీ నాయకులు.
అలాగే పదవుల ఆశచూపి వెనుకబడిన వర్గాల నుండి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రోజా పై కూడా ఇటువంటి ఆరోపణలే ఎదురయ్యాయి. దళిత మహిళగా ఉన్న నన్ను 70 లక్షల రూపాయిలు డిమాండ్ చేసారంటూ రోజా పై పుత్తూరు 17 వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. మాప్రభుత్వంలో అవినీతి లేదంటూ అంటూ ఒక పక్క ముఖ్యమంత్రి మైకుల ముందు ఉదరకొడుతుంటే మంత్రుల మీద ఇటువంటి అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నాయకుల నుండే ఎదురవ్వడం హాస్యాస్పదం.
ఇటువంటి వాటి పై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదురుకుంటున్న వారితో పాటు అటువంటి వారికీ టికెట్లు కేటాయిస్తూ ప్రోత్సహిస్తున్న జగన్ మీద కూడా ఉంటుంది.
లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు మోస్తూ 32 కేసులను వెనకేసుకున్న నాయకుడు ఇటువంటి వాటి పై స్పందిస్తాడు అనుకోవడం ఏపీ ప్రజల పిచ్చితనమే అవుతుందేమో.




