మా అధ్యక్ష పదవికి ఇండస్ట్రీలో జరిగే రచ్చ రాజకీయ పార్టీల మధ్య జరిగే సార్వత్రిక ఎన్నికల రచ్చకు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. అయితే అంతలా రచ్చ చేసుకుని చివరికి గెలిచిన ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఏమైనా చేస్తాడా అంటే ఒకసారి తానూ గెలిచినా పార్టీ గెలవలేదు అంటాడు.
మరోసారి నేను, పార్టీ ఇద్దరం గెలిచినా తనకు నిధులు చేకూరలేదంటాడు. ఇలా గెలుపు ఓటముల మధ్య ఉండే సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ పనులు చేయకుండా తప్పించుకుంటారు రాజకీయ నాయకులు. అయితే ఇప్పుడు ఇదే తీరి మా అధ్యక్షుడిని కూడా ఆకర్షించిందా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
వరుసగా రెండు సార్లు మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఎప్పుడు కుటుంబ వివాదాలతో వార్తలకెక్కుతున్నాడే తప్ప మా సంక్షేమం కోసమో, మా అభివృద్ధి కోసమో చర్యలు తీసుకుంటూ, నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తలలో నిలవడం లేదు. అలాగే తానూ మా అధ్యక్షుడైతే మా కోసం తక్షణమే ఒక భవన నిర్మాణం చెప్పాడతా అంటూ హామీ ఇచ్చారు.
అయితే ఆ నిర్మాణం ఇప్పుడు ఏ దశ వరకు వచ్చిందో కనీసం ఇండస్ట్రీలో ఎవరికైనా తెలుసా.? అంటే అందుకు జవాబు చెప్పేందుకు మా నుంచి ఏ ఒక్కరైనా ముందుకొస్తారా.? విష్ణు అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మా లో వచ్చిన మార్పులేంటి.? మా అధక్షుడిగా ఇండస్ట్రీలో విష్ణు పాత్రేమిటి.? ఇలా అనేక ప్రశ్నలు మా అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్నాయి.
మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో వివాదాలు వెంటాడాయి, ఇప్పటికి మరికొన్ని వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా మారిపోయాయి.
అయితే నాడు ఏపీలో మొదలైన సినిమా టికెట్ల రేట్ల పెంపు నుంచి హీరోల రెమ్యునరేషన్ల తగ్గింపు వరకు, అలాగే ఓటిటి రిలీజ్ ల నుంచి పైరసీ ప్రింట్ల వరకు సినీ ఇండస్ట్రీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగే వాటి పరిష్కారానికి ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంది.
అయితే ఇందులో ఏ ఒక్క సమస్య పై కూడా మా అధ్యక్షుడిగా మంచు విష్ణు స్పందించిందే లేదు. అలాగే సినీ సమస్య పరిష్కారం కోసం తన గొంతు వినిపించను లేదు, ఆ సమస్య పై పోరాడుతూ మీడియా కంటికి కనిపించింది లేదు. దీని బట్టే మా అధ్యక్షుడు అంటే మౌనంగా ఉండేవాడానా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇదిలా ఉంటే టికెట్ల రేట్ల పెంపు అంశం పై కానీ మూవీ పైరసి వివాదం పై కానీ చోటామోటా సినీ సెలబ్రెటీలు సైతం తమ తమ అభిప్రాయాలను వినిపిస్తున్నారు, అలాగే గత కొంత కాలంగా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న నటీనటులు కూడా ఈ సమస్యల పై తమ గళం విప్పుతున్నారు.
కోర్ట్ సినిమాతో, 90’s కిడ్స్ వెబ్ సిరీస్ తో తిరిగి సినీ ఇండస్ట్రీలో బిజీ అయినా ఒకప్పటి హీరో, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ సినిమా టికెట్ రేట్లు పెంచితే ఇంతలా మాట్లాడుతున్న వారు పండుగ సమయాలలో సొంతఊర్లకు రావడానికి ప్రయాణానికి పెట్టె అదనపు ఖర్చు గురించి ప్రశ్నించగలరా.?
సంక్రాంతి సమయంలో బస్సు చార్జీలు అమాంతం మూడు రేట్లు పెంచుతారు. కానీ వాటిని ఎవ్వరు ప్రశ్నించరు, కేవలం సినిమా టికెట్ రేట్ల మీద మాత్రమే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ తరుపున తన వాయిస్ వినిపించారు శివాజీ.
ఇక కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇండస్ట్రీ కి మద్దతుగా మాట్లాడారు. అలాగే అటు చిరు, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు వంటి వారు సైతం అటు పైరసీ పై పోరాటంతో ప్రభుత్వాలను, పోలీస్ అధికారులను సాయం కోరుతున్నారు.
ఇక పైరసీ అంశానికొస్తే ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాడినికొచ్చే ప్రతి కళాకారుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే మొన్నిఈమధ్య టాలీవుడ్ మొత్తం ఏకమయ్యి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సన్మానం చేసి సత్కరించింది.
అయితే ఇక్కడ కూడా మా అధ్యక్షుడిగా మంచు విష్ణు జాడెక్కడ కానరాలేదు. మరి ఇండస్ట్రీ కి సంబంధించి ఏ ఒక్క సమస్య మీద కూడా స్పందించలేని వారికి ఆ పదవులు అలంకార ప్రాయామే అనాలా.?






